Logo

2రాజులు అధ్యాయము 8

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఒకనాడు ఎలీషా తాను బ్రదికించిన బిడ్డకు తల్లియైన ఆమెను పిలిచి యెహోవా క్షామకాలము రప్పింపబోవుచున్నాడు; ఏడు సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి, నీవును నీ యింటివారును ఎచ్చటనుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా

02 ఆ స్త్రీ లేచి దైవజనుని మాటచొప్పున చేసి, తన యింటివారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి యేడు సంవత్సరములు అక్కడ వాసము చేసెను.

03 అయితే ఆ యేడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశములోనుండి వచ్చి తన యింటినిగూర్చియు భూమినిగూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను.

04 రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాటలాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి యుండెను.

05 అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగిరప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రదికించిన బిడ్డ తల్లి తన యింటినిగూర్చియు భూమినిగూర్చియు రాజుతో మనవిచేయ వచ్చెను. అంతట గేహజీ నా యేలినవాడవైన రాజా ఆ స్త్రీ యిదే; మరియు ఎలీషా తిరిగి బ్రదికించిన యీమె బిడ్డ వీడే అని చెప్పగా

06 రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటినుండి నేటివరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని సెలవిచ్చెను.

07 ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగియైయుండి, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలిసికొని

08 హజాయేలును పిలిచి నీవు ఒక కానుకను చేతపట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతనిద్వారా యెహోవా యొద్ద విచారణ చేయుమని ఆజ్ఞ ఇచ్చి పంపెను.

09 కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసికొని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెనని చెప్పెను.

10 అప్పుడు ఎలీషా నీవు అతనియొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగవచ్చునని చెప్పుము. అయినప్పటికిని అతనికి అవశ్యముగ మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసెనని పలికి

11 హజాయేలు ముఖము చిన్నబోవునంతవరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను.

12 హజాయేలు నా యేలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని నడుగగా ఎలీషా యీలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఇశ్రాయేలువారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు; వారి యౌవనస్థులను కత్తిచేత హతము చేయుదువు; వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు; వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగియుండుటచేత కన్నీళ్లు రాల్చుచున్నాను.

13 అందుకు హజాయేలు కుక్కవంటివాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటివాడను అని అతనితో అనగా, ఎలీషా నీవు సిరియామీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరచి యున్నాడనెను.

14 అతడు ఎలీషాను విడిచివెళ్లి తన యజమానుని యొద్దకు రాగా అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా అతడు నిజముగా నీవు బాగుపడుదువని అతడు చెప్పెననెను.

15 అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసికొని నీటిలో ముంచి రాజు ముఖముమీద పరచగా అతడు చచ్చెను; అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను.

16 అహాబు కుమారుడును ఇశ్రాయేలువారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో అయిదవ సంవత్సరమందు యెహోషాపాతు యూదారాజై యుండగా యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏల నారంభించెను.

17 అతడు ఏల నారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడై యుండి యెరూషలేమందు ఎనిమిది సంవత్సరములు ఏలెను.

18 ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసికొనియుండెను గనుక అహాబు కుటుంబికులవలెనే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

19 అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట యిచ్చియుండెను గనుక అతని జ్ఞాపకముచేత యూదాను నశింపజేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను.

20 ఇతని దినములలో ఎదోమీయులు యూదా రాజునకు ఇక లోబడుట మాని అతనిమీద తిరుగుబాటు చేసి, తమమీద నొకని రాజుగా నియమించుకొనినందున

21 యెహోరాము తన రథములన్నిటిని తీసికొనిపోయి జాయీరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టునున్న ఎదోమీయులను రథములమీది అధిపతులను హతముచేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి.

22 అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదావారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరుగబడెను.

23 యెహోరాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దాని నంతటినిగూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

24 యెహోరాము తన పితరులతో కూడ నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.

25 అహాబు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోరాము ఏలుబడిలో పండ్రెండవ సంవత్సరమందు యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా యేలనారంభించెను.

26 అహజ్యా యేలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యుండి యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను. అతని తల్లిపేరు అతల్యా; ఈమె ఇశ్రాయేలు రాజైన ఒమీ కుమార్తె.

27 అతడు అహాబు కుటుంబికుల ప్రవర్తనను అనుసరించుచు, వారివలెనే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను; అతడు అహాబు ఇంటివారికి అల్లుడు.

28 అతడు అహాబు కుమారుడైన యెహోరాముతోకూడ రామోత్గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధముచేయ బయలుదేరగా సిరియనులు యెహోరామును గాయపరచిరి.

29 రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనులవలన తాను పొందిన గాయములను బాగుచేసికొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగిరాగా యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము రోగియాయెనని తెలిసికొని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చెను.