Logo

నెహెమ్యా అధ్యాయము 2

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అటుతరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున ఇరువదియవ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసికొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడును అతని యెదుట విచారముగా ఉండలేదు.

02 కాగా రాజు నీకు వ్యాధి లేదుగదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖముచేతనే అది కలిగినదని నాతో అనగా

03 నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడి యుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని.

04 అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి

05 రాజుతో నీ సముఖమందు నేను దయపొందినయెడల, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని.

06 అందుకు రాజు రాణి తనయొద్ద కూర్చునియుండగా నీ ప్రయాణము ఎన్నిదినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చెదవని అడిగెను. నేను ఇంత కాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయెను.

07 ఇదియు గాక రాజుతో నేనిట్లంటిని రాజున కనుకూలమైతే యూదా దేశమున నేను చేరువరకు నన్ను దాటించునట్లుగా నది యవతల నున్న అధికారులకు తాకీదులను,

08 పట్టణప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని; ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను.

09 తరువాత నేను నది యవతలనున్న అధికారులయొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతోకూడ సేనాధిపతులను గుఱ్ఱపు రౌతులను పంపించెను.

10 హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.

11 అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే యుండి

12 రాత్రియందు నేనును నాతోకూడ నున్న కొందరును లేచితివిు. యెరూషలేమునుగూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి యే పశువును నాయొద్ద ఉండలేదు.

13 నేను రాత్రికాలమందు లోయద్వారము గుండ భుజంగపు బావి యెదుటికిని పెంటద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను.

14 తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్లితిని గాని, నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను.

15 నేను రాత్రియందు మడుగు దగ్గరనుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చితిని.

16 అయితే నేను ఎచ్చటికి వెళ్లినది యేమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని పనిచేయు ఇతరమైనవారికే గాని నేను ఆ సంగతి చెప్పియుండలేదు.

17 అయితే వారితో నేనిట్లంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసియున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచియున్నారు, మనకు ఇకమీదట నింద రాకుండ యెరూషలేము యొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి.

18 ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమునుగూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నియు నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి యీ మంచికార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి.

19 అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబీయా అనువాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పనియేమిటి? రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి.

20 అందుకు నేను ఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము, యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపకసూచనయైనను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని.