Logo

నెహెమ్యా అధ్యాయము 13

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులుగాని మోయాబీయులుగాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు.

02 వారు అన్నపానములు తీసికొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్రాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను.

03 కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలీయులలోనుండి వెలివేసిరి.

04 ఇంతకుముందు మన దేవుని మందిరపు గదిమీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబీయాతో బంధుత్వము కలుగజేసికొని

05 నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదియవ భాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద, అతనికి ఒకగొప్ప గదిని సిద్ధముచేసి యుండెను.

06 ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త యేలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్నిదినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని

07 యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబీయాకు ఒక గది యేర్పరచి చేసిన కీడంతయు తెలిసికొని

08 బహుగా దుఃఖపడి ఆ గదిలోనుండి టోబీయా యొక్క సామగ్రియంతయు అవతల పారవేసి, గదులన్నియు శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారాలాగు చేసిరి.

09 పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్యపదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరల తెప్పించితిని.

10 మరియు లేవీయులకు రావలసిన పాళ్లు వారికి అందకపోవుటచేత సేవచేయు లేవీయులును గాయకులును తమ పొలములకు పారిపోయిరని తెలిసికొని

11 నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి, వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని.

12 అటుతరువాత యూదులందరును ధాన్య ద్రాక్షారస తైలములలో పదియవ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి.

13 నమ్మకముగల మనుష్యులని పేరుపొందిన షెలెమ్యా అను యాజకుని సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానామీద నేను కాపరులగా నియమించితిని; వారిచేతిక్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను; మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను.

14 నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని, నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము.

15 ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతిదినమున ద్రాక్షతొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదలమీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్షపండ్లను అంజూరపు పండ్లను నానావిధములైన బరువులను విశ్రాంతిదినమున యెరూషలేములోనికి తీసికొనివచ్చుటయు చూచి, యీ ఆహారవస్తువులను ఆ దినమున అమ్మినవారిని గద్దించితిని.

16 తూరుదేశస్థులును కాపురముండి, యెరూషలేములోను విశ్రాంతిదినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి.

17 అంతట యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు?

18 మీ పితరులును ఇట్లు చేసి దేవునియొద్దనుండి మనమీదికిని యీ పట్టణస్థులమీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని.

19 మరియు విశ్రాంతిదినమునకు ముందు చీకటిపడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతిదినము గడచువరకు వాటిని తియ్యకూడదనియు నేనాజ్ఞాపించితిని మరియు విశ్రాంతిదినమున ఏ బరువైనను లోపలికి రాకుండ గుమ్మములయొద్ద నా పనివారిలో కొందరిని కావలి యుంచితిని.

20 వర్తకులును నానావిధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు యెరూషలేము అవతల బసచేసికొనగా

21 నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని మీరు గోడచాటున ఎందుకు బసచేసికొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసినయెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని; అప్పటినుండి విశ్రాంతిదినమున వారు మరి రాలేదు.

22 అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతిదినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, యిందునుగూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము.

23 ఆ దినములలో అష్డోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసికొనిన కొందరు యూదులు నాకు కనబడిరి.

24 వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆ యా భాషలు మాటలాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు.

25 అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి

26 ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతనివంటి రాజు లేకపోయినను, అతడు తన దేవునిచేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా నియమింపబడినను, అన్యస్త్రీలు అతనిచేత సహా పాపము చేయించలేదా?

27 కాగా ఇంతగొప్ప కీడు చేయునట్లును, మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్యస్త్రీలను వివాహము చేసికొనిన మీవంటివారి మాటలను మేము ఆలకింపవచ్చునా? అని అడిగితిని.

28 ప్రధానయాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానినిబట్టి నేను అతని నాయొద్దనుండి తరిమితిని.

29 నా దేవా, వారు యాజకధర్మమును, యాజకధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకముంచకొనుము.

30 ఈలాగున వారు ఏ పరదేశులలోను కలియకుండ వారిని పవిత్రపరచి, ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవచేయునట్లు నియమించితిని.

31 మరియు కావలసి వచ్చినప్పుడెల్ల కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసికొని వచ్చునట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.