Logo

ఆదికాండము అధ్యాయము 10

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.

02 యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.

03 గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు.

04 యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు.

05 వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము, ఆ యా దేశములలో వారు వేరైపోయిరి.

06 హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.

07 కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.

08 కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.

09 అతడు యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి కలదు.

10 షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.

11 ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును

12 నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము.

13 మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను

14 పత్రుసీయులను కస్లూహీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు.

15 కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను

16 హివ్వీయులను అర్కీయులను సినీయులను

17 అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను.

18 తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.

19 కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిములకు వెళ్లు మార్గములో లాషా వరకును ఉన్నది.

20 వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములనుబట్టియు జాతులనుబట్టియు హాము కుమారులు.

21 మరియు ఏబెరు యొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.

22 షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామనువారు.

23 అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.

24 అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.

25 ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.

26 యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును

27 హదోరమును ఊజాలును దిక్లాను

28 ఓబాలును అబీమాయెలును షేబను

29 ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు.

30 మేషా నుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పుకొండలు వారి నివాసస్థలము.

31 వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశ ములనుబట్టియు తమ తమ జాతులనుబట్టియు షేము కుమారులు.

32 వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమిమీద వ్యాపించెను.