Logo

ఆదికాండము అధ్యాయము 8

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దేవుడు నోవహును అతనితోకూడ ఓడలో నున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.

02 అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకాశమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను.

03 అప్పుడు నీళ్లు భూమిమీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను; నూటఏబది దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా

04 ఏడవ నెల పదియేడవ దినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను.

05 నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచు వచ్చెను. పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను.

06 నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి

07 ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను.

08 మరియు నీళ్లు నేలమీదనుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తనయొద్దనుండి నల్ల పావురమొకటి వెలుపలికి పోవిడిచెను.

09 నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతనియొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసికొనెను.

10 అతడు మరి యేడు దినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను.

11 సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను.

12 అతడింక మరి యేడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతనియొద్దకు తిరిగి రాలేదు.

13 మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమిమీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను.

14 రెండవ నెల యిరువది యేడవ దినమున భూమి యెండియుండెను.

15 అప్పుడు దేవుడు

16 నీవును నీతో కూడ నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి.

17 పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడ నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను.

18 కాబట్టి నోవహును అతనితో కూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి.

19 ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమిమీద సంచరించునవన్నియు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలోనుండి బయటికి వచ్చెను.

20 అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.

21 అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి ఇకమీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను

22 భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతకాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.