Logo

యిర్మియా అధ్యాయము 52

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 సిద్కియా యేలనారంభించినప్పుడు అతడు ఇరువది యొక్క సంవత్సరములవాడు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను, అతని తల్లిపేరు హమూటలు; ఈమె లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె.

02 యెహోయాకీము నడిచిన చెడ్డనడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డనడత నడిచెను.

03 యెహోవా కోపపడి తనయెదుట నుండకుండ వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజుమీద తిరుగుబాటుచేయగా

04 అతని యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేముమీదికి వచ్చి, దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టు కోటలు కట్టిరి.

05 ఆలాగు జరుగగా సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరమువరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను.

06 నాల్గవ నెల తొమ్మిదవ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను.

07 పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరు పారిపోయి రాజుతోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములోనుండి బయలువెళ్లిరి; కల్దీయులు పట్టణమును చుట్టుకొనియుండగా సైనికులు యొర్దానునది మార్గముగా తర్లిపోయిరి.

08 కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలిసికొనగా అతని దండంతయు అతనియొద్దనుండి చెదరిపోయెను.

09 వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లాపట్టణమున నున్న బబులోను రాజునొద్దకు అతని తీసికొనిపోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించెను.

10 బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను; మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులనందరిని చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి

11 రెండు సంకెళ్లతో అతని బంధించి, బబులోనునకు అతని తీసికొనిపోయి, మరణమగువరకు చెరసాలలో అతని పెట్టించెను.

12 అయిదవ నెల పదియవ దినమున, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడియందు పందొమ్మిదవ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానను రాజదేహసంరక్షకుల యధిపతి యెరూషలేమునకు వచ్చెను.

13 అతడు యెహోవా మందిరమును రాజునగరును యెరూషలేములోని గొప్పవారి యిండ్లనన్నిటిని కాల్చివేసెను.

14 మరియు రాజదేహసంరక్షకుల యధిపతితోకూడ నుండిన కల్దీయుల సేనాసంబంధులందరు యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటిని పడగొట్టిరి

15 మరియు రాజ దేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను ప్రజలలో కడుబీదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను, బబులోనురాజు పక్షము చేరినవారిని, గట్టి పనివారిలో శేషించినవారిని చెరగొనిపోయెను.

16 అయితే రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడుబీదలలో కొందరిని ఉండనిచ్చెను.

17 మరియు యెహోవా మందిరములోనుండిన ఇత్తడి స్తంభములను మందిరములోనుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు గొనిపోయిరి.

18 అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటిని గొనిపోయిరి.

19 మరియు పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పాత్రలను, బంగారు వాటిని బంగారునకును వెండివాటిని వెండికిని చేర్చుకొని రాజదేహసంరక్షకుల యధిపతి గొనిపోయెను.

20 రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లక్రిందనుండిన పండ్రెండు ఇత్తడి వృషభములను గొనిపోయెను. వీటికన్నిటికున్న ఇత్తడి యెత్తువేయుటకు అసాధ్యము.

21 వాటిలో ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల యెత్తుగలది, పండ్రెండు మూరల నూలు దాని చుట్టు తిరుగును, దాని దళసరి నాలుగు వ్రేళ్లు; అది గుల్లది.

22 దానిమీద ఇత్తడి పైపీట యుండెను; ఒక్క పైపీట అయిదేసి మూరల ఎత్తుగలది, పైపీటకు చుట్టు అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లును ఉండెను; అవి యన్నియు ఇత్తడివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును ఆలాగుననే దానిమ్మ పండ్లుండెను.

23 ప్రక్కలయందు తొంబదియారు దానిమ్మ పండ్లుండెను; చుట్టు ఉండిన వల అల్లికమీద దానిమ్మ పండ్లన్నియు నూరు.

24 మరియు రాజదేహసంరక్షకుల యధిపతి ప్రధాన యాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను.

25 అతడు పట్టణములోనుండి యోధులమీద నియమింపబడిన యొక ఉద్యోగస్ధుని, పట్టణములో దొరికిన రాజసన్నిధిలో నిలుచు ఏడుగురు మనుష్యులను, దేశ సైన్యాధిపతియగు వానియొక్క లేఖరిని, పట్టణపు మధ్యను దొరికిన అరువదిమంది దేశప్రజలను పట్టుకొనెను.

26 రాజ దేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను వీరిని పట్టుకొని రిబ్లాలో నుండిన బబులోను రాజునొద్దకు తీసికొని వచ్చెను.

27 బబులోను రాజు హమాతు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదావారిని తమ దేశములోనుండి చెరగొనిపోయెను.

28 నెబుకద్రెజరు తన యేలుబడియందు ఏడవ సంవత్సరమున మూడువేల ఇరువది ముగ్గురు యూదులను చెరగొనిపోయెను

29 నెబుకద్రెజరు ఏలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున అతడు యెరూషలేమునుండి ఎనిమిదివందల ముప్పది యిద్దరిని చెరగొనిపోయెను.

30 నెబుకద్రెజరు ఏలుబడియందు ఇరువది మూడవ సంవత్సరమున రాజ దేహసంరక్షకుల యధిపతియగు నెబూజరదాను యూదులలో ఏడువందల నలుబది యయిదుగురు మనుష్యులను చెరగొనిపోయెను; ఆ మనుష్యుల వెరసి నాలుగువేల ఆరువందలు.

31 యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన ముప్పది యేడవ సంవత్సరమున పండ్రెండవ నెల యిరువదియైదవ దినమున బబులోనురాజైన ఎవీల్మెరోదకు తన యేలుబడియందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహోయాకీనునకు దయచూపి, బందీగృహములోనుండి అతని తెప్పించి

32 అతనితో దయగా మాటలాడి అతనితోకూడ బబులోనులోనుండు రాజుల సింహాసనముకంటె ఎత్తయిన సింహాసనము అతనికి నియమించెను.

33 మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించికొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను.

34 మరియు అతడు చనిపోవువరకు అతడు బ్రతికిన దినములన్నియు అనుదినము అతని పోషణకై బబులోను రాజుచేత భోజనపదార్థములు ఇయ్యబడుచుండెను.