Logo

మత్తయి అధ్యాయము 12

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంటచేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి.

02 పరిసయ్యులదిచూచి ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా

03 ఆయన వారితో ఇట్లనెను తానును తనతో కూడ నున్నవారును ఆకలిగొని యుండగా దావీదు చేసిన దానిగూర్చి మీరు చదువలేదా?

04 అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులే తప్ప తానైనను తనతో కూడ ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను.

05 మరియు యాజకులు విశ్రాంతిదినమున దేవాలయములో విశ్రాంతిదినమును ఉల్లంఘించియు నిర్దోషులై యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా?

06 దేవాలయముకంటె గొప్పవాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను.

07 మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు.

08 కాగా మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడనెను.

09 ఆయన అక్కడనుండి వెళ్లి వారి సమాజమందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచచెయ్యి గలవాడొకడు కనబడెను.

10 వారాయనమీద నేరము మోపవలెనని విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఆయనను అడిగిరి.

11 అందుకాయన మీలో ఏ మనుష్యునికైనను నొక గొఱ్ఱయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా?

12 గొఱ్ఱ కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి

13 ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది బాగుపడెను.

14 అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.

15 యేసు ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహు జనులాయనను వెంబడింపగా

16 ఆయన వారినందరిని స్వస్థపరచి, తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను.

17 ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు (ఆలాగు జరిగెను) అదేమనగా

18 ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.

19 ఈయన జగడమాడడు, కేకలువేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు

20 విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు

21 ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే

22 అప్పుడు దయ్యముపట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను.

23 అందుకు ప్రజలందరు విస్మయమొంది ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొనుచుండిరి.

24 పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి.

25 ఆయన వారి తలంపులనెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు.

26 సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?

27 నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులైయుందురు.

28 దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది.

29 ఒకడు మొదట బలవంతుని బంధింపనియెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును.

30 నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.

31 కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు.

32 మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.

33 చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును.

34 సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.

35 సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.

36 నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.

37 నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.

38 అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు బోధకుడా, నీవలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను.

39 వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ యైనను వారికి అనుగ్రహింపబడదు.

40 యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.

41 నీనెవెవారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.

42 విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.

43 అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును.

44 విశ్రాంతి దొరకనందున నేను వదలివచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యింట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి, వెళ్లి తనకంటె చెడ్డవైన మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును; అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును.

45 అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితికంటె చెడ్డదగును. ఆలాగే యీ దుష్టతరమువారికిని సంభవించుననెను.

46 ఆయన జనసమూహములతో ఇంక మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండిరి.

47 అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను.

48 అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవాని చూచి నా తల్లి యెవరు? నా సహోదరులెవరు? అని చెప్పి

49 తన శిష్యులవైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును;

50 పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు ననెను.