Logo

మార్కు అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆయన అక్కడనుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి.

02 విశ్రాంతిదినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింప నారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతులవలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇదేమి?

03 ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.

04 అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను.

05 అందువలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను.

06 ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను.

07 ఆయన పండ్రెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, అపవిత్రాత్మలమీద వారికధికారమిచ్చి

08 ప్రయాణముకొరకు చేతికఱ్ఱను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసికొనక

09 చెప్పులు తొడగుకొనుడనియు, రెండంగీలు వేసికొనవద్దనియు వారికాజ్ఞాపించెను.

10 మరియు ఆయన వారితో ఇట్లనెను మీరెక్కడ ఒక యింట ప్రవేశించెదరో అక్కడనుండి మీరు బయలుదేరువరకు ఆ యింటనే బసచేయుడి.

11 ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి.

12 కాగా వారు బయలుదేరి, మారుమనస్సు పొందవలెనని ప్రకటించుచు

13 అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచునుండిరి.

14 ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి విని బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడు గనుక అతనియందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను.

15 ఇతరులు ఈయన ఏలీయా అనియు, మరికొందరు ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి.

16 అయితే హేరోదు విని నేను తల గొట్టించిన యోహానే; అతడు మృతులలోనుండి లేచియున్నాడని చెప్పెను.

17 హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక

18 ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి, చెరసాలలో బంధించియుండెను.

19 హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింపగోరెను గాని ఆమెచేత గాకపోయెను.

20 ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు, ఏమిచేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను.

21 అయితే తగిన దినమొకటి వచ్చెను; ఎట్లనగా, హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయదేశ ప్రముఖులకును విందు చేయించెను.

22 అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడ పంక్తిని కూర్చున్నవారిని సంతోషపరచెను గనుక రాజు నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను

23 మరియు నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను

24 గనుక ఆమె వెళ్లి నేనేమి అడిగెదనని తన తల్లినడుగగా ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను.

25 వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్లెములో పెట్టి యిప్పుడే నాకిప్పింపగోరుచున్నానని చెప్పెను.

26 రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్నవారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లక పోయెను.

27 వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక బంట్రౌతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి

28 పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదాని కిచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను.

29 యోహాను శిష్యులు ఈ సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి.

30 అంతట అపొస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియజేసిరి.

31 అప్పుడాయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున, భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను

32 కాగా వారు దోనె యెక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిరి.

33 వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణములనుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటె ముందుగా వచ్చిరి.

34 గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింపసాగెను.

35 చాల ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాల ప్రొద్దుపోయినది;

36 చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్లి భోజనమునకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయుమని చెప్పిరి.

37 అందుకాయన మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్లి యీన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి.

38 అందుకాయన మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని అయిదు రొట్టెలును రెండు చేపలు నున్నవనిరి.

39 అప్పుడాయన పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికాజ్ఞాపింపగా

40 వారు నూరేసిమంది చొప్పునను ఏబదేసిమంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి.

41 అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని, ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఆ రొట్టెలు విరిచి, వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి, ఆ రెండు చేపలను అందరికిని పంచిపెట్టెను

42 వారందరు తిని తృప్తి పొందిన

43 తరువాత మిగిలిన చేపలును రొట్టెముక్కలును పండ్రెండు గంపెళ్లు ఎత్తిరి.

44 ఆ రొట్టెలు తినినవారు అయిదువేలమంది పురుషులు.

45 ఆయన జనసమూహమును పంపివేయునంతలో, దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను.

46 ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లెను.

47 సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను.

48 అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వారిని దాటిపోవలేనని యుండెను

49 ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి, భూతమని తలంచి కేకలు వేసిరి.

50 అందరు ఆయనను చూచి తొందరపడగా, వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను.

51 తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను, అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతినొందిరి;

52 అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు.

53 వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి.

54 వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపట్టి

55 ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినిన చోటునకు రోగులను మంచములమీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి.

56 గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన యెక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీథులలో ఉంచి, వారిని ఆయన వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టినవారందరు స్వస్థతనొందిరి.