Logo

మార్కు అధ్యాయము 8

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ దినములలో మరియొకసారి బహు జనులు కూడి రాగా, వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తనయొద్దకు పిలిచి

02 జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్దనున్నారు; వారికి తిననేమియు లేనందున, నేను వారిమీద కనికరపడుచున్నాను;

03 నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినయెడల మార్గములో మూర్ఛపోవుదురు; వారిలో కొందరు దూరమునుండి వచ్చియున్నారని వారితో చెప్పెను.

04 అందుకాయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడనుండి రొట్టెలు తెచ్చి, వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి.

05 ఆయన మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారినడుగగా వారు ఏడనిరి.

06 అప్పుడాయన నేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి ఆ యేడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి

07 కొన్ని చిన్న చేపలు కూడ వారియొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటినికూడ వడ్డించుడని చెప్పెను.

08 వారు భోజనముచేసి తృప్తిపొందినమీదట, మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండ ఎత్తిరి.

09 భోజనము చేసినవారు ఇంచుమించు నాలుగు వేలమంది. వారిని పంపివేసిన వెంటనే

10 ఆయన తన శిష్యులతోకూడ దోనె యెక్కి దల్మనూతా ప్రాంతములకు వచ్చెను.

11 అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఆకాశమునుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి.

12 ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరమువారు ఎందుకు సూచక క్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి

13 వారిని విడిచి మరల దోనె యెక్కి అద్దరికి పోయెను.

14 వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి; దోనెలో వారియొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియు లేకపోయెను.

15 ఆయన చూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండినిగూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్తపడుడని వారిని హెచ్చరింపగా

16 వారు తమయొద్ద రొట్టెలు లేవేయని తమలోతాము ఆలోచించుకొనిరి.

17 యేసు అది యెరిగి మనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠినహృదయము గలవారై యున్నారా?

18 మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసికొనరా?

19 నేను ఆ అయిదువేల మందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారి నడిగెను. వారు పండ్రెండని ఆయనతో చెప్పిరి.

20 ఆ నాలుగువేల మందికి ఏడు రొట్టెలు నేను విరిచి, పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని ఆయన అడుగగా వారు ఏడనిరి.

21 అందుకాయన మీరింకను గ్రహింపకున్నారా? అని అనెను.

22 అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయనయొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొనివచ్చి, వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి.

23 ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొనిపోయి, వాని కన్నులమీద ఉమ్మివేసి, వానిమీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా,

24 వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను.

25 అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా, వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను.

26 అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని యింటికి వానిని పంపివేసెను.

27 యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములోనుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులనడిగెను.

28 అందుకు వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.

29 అందుకాయన మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారినడుగగా పేతురు నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను.

30 అప్పుడు తన్నుగూర్చిన యీ సంగతి ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను.

31 మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను ఉపేక్షింపబడి చంపబడి, మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను.

32 ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయిపట్టుకొని ఆయనను గద్దింపసాగెను

33 అందుకాయన తన శిష్యులవైపు తిరిగి, వారిని చూచి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను

34 అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తనయొద్దకు పిలిచినన్ను వెంబడింపగోరువాడు తన్నుతాను ఉపేక్షించుకొని తన సిలువ యెత్తికొని నన్ను వెంబడింపవలెను.

35 తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును.

36 ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?

37 మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?

38 వ్యభిచారమును పాపమును చేయు ఈ తరమువారిలో నన్నుగూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను.