Logo

మార్కు అధ్యాయము 10

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆయన అక్కడనుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయనయొద్దకు కూడివచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను.

02 పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని ఆయన నడిగిరి.

03 అందుకాయన మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారినడిగెను.

04 వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా

05 యేసు మీ హృదయకాఠిన్యమునుబట్టి అతడీ ఆజ్ఞను మీకు వ్రాసియిచ్చెను గాని

06 సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను.

07 ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును;

08 వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు.

09 కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను.

10 ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతినిగూర్చి ఆయనను మరల నడిగిరి.

11 అందుకాయన తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లి చేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును.

12 మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను.

13 తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొనివచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి.

14 యేసు అది చూచి కోపపడి చిన్నబిడ్డలను నాయెద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవుని రాజ్యము ఈలాటివారిదే.

15 చిన్నబిడ్డ వలె దేవుని రాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంతమాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి

16 ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారిమీద చేతులుంచి ఆశీర్వదించెను.

17 ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూని సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను.

18 యేసు నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు.

19 నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను.

20 అందుకతడు బోధకుడా, బాల్యమునుండి ఇవన్నియు అనుసరించుచునే యుంటినని చెప్పెను.

21 యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను.

22 అతడు మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్లిపోయెను.

23 అప్పుడు యేసు చుట్టు చూచి ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను.

24 ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము;

25 ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము.

26 అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన నడిగిరి.

27 యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను.

28 పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను.

29 అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు

30 ఇప్పుడు ఇహమందు హింసలతోపాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

31 మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అనెను.

32 వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్లుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన మరల పండ్రెండుగురు శిష్యులను పిలుచుకొని, తనకు సంభవింపబోవువాటిని వారికి తెలియజెప్ప నారంభించి

33 ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనుల కప్పగించెదరు.

34 వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను.

35 జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, మేము అడుగునదెల్ల నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా

36 ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారినడిగెను.

37 వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని చెప్పిరి.

38 యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు; నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీచేత అగునా? అని వారినడుగగా వారు మాచేత అగుననిరి.

39 అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు; నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు, గాని

40 నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నావశములో లేదు; అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే (దొరకునని) వారితో చెప్పెను.

41 తక్కిన పదిమంది శిష్యులు ఆ మాట విని, యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి.

42 యేసు వారిని తనయొద్దకు పిలిచి వారితో ఇట్లనెను అన్యజనులలో అధికారులని యెంచబడినవారు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురని మీకు తెలియును.

43 మీలో ఆలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరినయెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండవలెను.

44 మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరినయెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను.

45 మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.

46 వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను.

47 ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలువేయ మొదలుపెట్టెను.

48 ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను.

49 అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి.

50 అంతట వాడు బట్టను పారవేసి, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను.

51 యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వానినడుగగా, ఆ గ్రుడ్డివాడు బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుమని ఆయనతో అనెను.

52 అందుకు యేసు నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయనవెంట చూపుపొంది వెళ్లెను.