Logo

మార్కు అధ్యాయము 14

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ, అనగా పులియని రొట్టెలపండుగ వచ్చెను. అప్పుడు ప్రధానయాజకులును శాస్త్రులును మాయోపాయముచేత ఆయననేలాగు పట్టుకొని చంపుదుమా యని ఆలోచించుకొనుచుండిరి గాని

02 ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి.

03 ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసికొనివచ్చి, ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను.

04 అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేల?

05 ఈ అత్తరు మున్నూరు దేనారములకంటె ఎక్కువ వెలకమ్మి, బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెనుగూర్చి సణుగుకొనిరి.

06 అందుకు యేసు ఇట్లనెను ఈమె జోలికి పోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నాయెడల మంచి కార్యము చేసెను.

07 బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు, మీకిష్టమైనప్పుడెల్ల వారికి మేలు చేయవచ్చును; నేను ఎల్లప్పుడును మీతో నుండను.

08 ఈమె తన శక్తికొలది చేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను.

09 సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

10 పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారియొద్దకు పోగా

11 వారు విని, సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను.

12 పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కాపశువును వధించునప్పుడు, ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచవలెనని కోరుచున్నావని ఆయన నడుగగా,

13 ఆయన మీరు పట్టణములోనికి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును;

14 వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు నా విడిదిగది యెక్కడనని బోధకుడడుగుచున్నాడని చెప్పుడి.

15 అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను.

16 శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి.

17 సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతో కూడ వచ్చెను.

18 వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా

19 వారు దుఃఖపడి నేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి.

20 అందుకాయన పండ్రెండుమందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచువాడే.

21 నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలనెను.

22 వారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చి మీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను.

23 పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి.

24 అప్పుడాయన ఇది నిబంధన విషయమై అనేకులకొరకు చిందింపబడుచున్న నా రక్తము.

25 నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినమువరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

26 అంతట వారు కీర్తన పాడి ఒలీవలకొండకు వెళ్లిరి.

27 అప్పుడు యేసు వారిని చూచి మీరందరు అభ్యంతరపడెదరు; గొఱ్ఱల కాపరిని కొట్టుదును; గొఱ్ఱలు చెదరిపోవును అని వ్రాయబడియున్నది గదా.

28 అయితే నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లెదననెను.

29 అందుకు పేతురు అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా

30 యేసు అతని చూచి నేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

31 అతడు మరి ఖండితముగా నేను నీతోకూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరు ననిరి.

32 వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి

33 పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొనిపోయి, మిగుల విభ్రాంతినొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను

34 అప్పుడాయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి

35 కొంతదూరము సాగిపోయి నేలమీద పడి, సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు

36 నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను.

37 మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియయైనను మేలుకొని యుండలేవా?

38 మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి

39 తిరిగిపోయి, యింతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను.

40 ఆయన తిరిగివచ్చి చూడగా, వారు నిద్రించుచుండిరి; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచలేదు.

41 ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు;

42 లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని చెప్పెను.

43 వెంటనే, ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండుమంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని, ప్రధానయాజకుల యొద్దనుండియు శాస్త్రుల యొద్దనుండియు పెద్దల యొద్దనుండియు వచ్చిరి.

44 ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే (యేసు)? ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను.

45 వాడు వచ్చి వెంటనే ఆయనయొద్దకు పోయి బోధకుడా అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనగా

46 వారు ఆయనమీద పడి ఆయనను పట్టుకొనిరి.

47 దగ్గర నిలిచియున్నవారిలో ఒకడు కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను.

48 అందుకు యేసు మీరు బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా?

49 నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించుచుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను).

50 అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి.

51 తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు ఆయన వెంట వెళ్లుచుండగా, వారతనిని పట్టుకొనిరి.

52 అతడు నారబట్ట విడిచి, దిగంబరుడై పారిపోయెను.

53 వారు యేసును ప్రధానయాజకునియొద్దకు తీసికొనిపోయిరి. ప్రధానయాజకులు పెద్దలు శాస్త్రులు అందరును అతనితోకూడ వచ్చిరి.

54 పేతురు ప్రధానయాజకుని యింటి ముంగిటివరకు దూరమునుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద చలి కాచుకొనుచుండెను.

55 ప్రధానయాజకులును మహాసభ వారందరును యేసును చంపింపవలెనని ఆయనమీద సాక్ష్యము వెదకిరిగాని, యేమియు వారికి దొరకలేదు.

56 అనేకులు ఆయనమీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు.

57 అప్పుడు కొందరు లేచి చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో చేతిపనికాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని

58 ఆయనమీద అబద్ధసాక్ష్యము చెప్పిరి

59 గాని ఆలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు.

60 ప్రధానయాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసునడిగెను.

61 అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధానయాజకుడు పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయననడుగగా

62 యేసు అవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను.

63 ప్రధానయాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకు ఇక సాక్షులతో పనియేమి?

64 ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరు మరణమునకు పాత్రుడని ఆయనమీద నేరస్థాపన చేసిరి.

65 కొందరు ఆయనమీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుకు వేసి, ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి.

66 పేతురు ముంగిటి క్రిందిభాగములో ఉండగా ప్రధానయాజకుని పనికత్తెలలో ఒకతె వచ్చి

67 పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను; అతనిని నిదానించి చూచి నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడ ఉండినవాడవు కావా? అనెను.

68 అందుకతడు ఆయన ఎవడో నేనెరుగను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్లెను; అంతట కోడి కూసెను.

69 ఆ పనికత్తె అతనిని చూచి వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్నవారితో మరల చెప్పసాగెను.

70 అతడు మరల నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలయుడవు గదా అనిరి.

71 అందుకతడు మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి, శపించుకొనుటకును ఒట్టుబెట్టుకొనుటకును మొదలుపెట్టెను.

72 వెంటనే రెండవమారు కోడి కూసెను గనుక కోడి రెండుమారులు కూయకమునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పినమాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను.