Logo

లూకా అధ్యాయము 7

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆయన తన మాటలన్నియు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను.

02 ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావ సిద్ధమైయుండెను.

03 శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను.

04 వారు యేసునొద్దకు వచ్చి నీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు;

05 అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి.

06 కావున యేసు వారితో కూడ వెళ్లెను. ఆయన ఆ యింటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరాయన యొద్దకు వెళ్లి ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను.

07 అందుచేత నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచకొనలేదు; అయితే మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును,

08 నేను సహా అధికారమునకు లోబడినవాడను; నాచేతిక్రిందను సైనికులు ఉన్నారు; నేనొకని పొమ్మంటె పోవును, ఒకని రమ్మంటె వచ్చును, నాదాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను.

09 యేసు ఈ మాటలు విని, అతనిగూర్చి ఆశ్చర్యపడి, తనవెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాననెను.

10 పంపబడిన వారు ఇంటికి తిరిగివచ్చి, ఆ దాసుడు స్వస్థుడై యుండుట కనుగొనిరి.

11 వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్లుచుండగా, ఆయన శిష్యులును బహు జనసమూహమును ఆయనతో కూడ వెళ్లుచుండిరి.

12 ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చినప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి.

13 ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి--ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి.

14 ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా

15 ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను.

16 అందరు భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమనుగ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి.

17 ఆయనను గూర్చిన యీ సమాచారము యూదయ యందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను.

18 యోహాను శిష్యులు ఈ సంగతులన్నియు అతనికి తెలియజేసిరి.

19 అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా? అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను.

20 ఆ మనుష్యులు ఆయన యొద్దకు వచ్చి రాబోవువాడవు నీవేనా? లేక మరియొకనికొరకు మేము కనిపెట్టవలెనా? అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీయొద్దకు పంపెనని చెప్పిరి.

21 ఆ గడియలోనే ఆయన రోగములును, బాధలును, అపవిత్రాత్మలునుగల అనేకులను స్వస్థపరచి, చాలమంది గ్రుడ్డివారికి చూపు దయచేసెను.

22 అప్పుడాయన మీరు వెళ్లి, కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది

23 నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను.

24 యోహానుదూతలు వెళ్లిన తరువాత, ఆయన యోహానును గూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా?

25 మరేమి చూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని, సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు.

26 అయితే మరేమి చూడవెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.

27 ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని యెవరినిగూర్చి వ్రాయబడెనో అతడే యీ యోహాను.

28 స్త్రీలు కనినవారిలో యోహానుకంటె గొప్పవాడెవడును లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడని మీతో చెప్పుచున్నాను.

29 ప్రజలందరును సుంకరులును (యోహాను బోధ) విని, అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై, దేవుడు న్యాయవంతుడని యొప్పుకొనిరి గాని

30 పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి.

31 కాబట్టి యీ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును, వారు దేనిని పోలియున్నారు?

32 సంతవీధులలో కూర్చుండియుండి మీకు పిల్లనగ్రోవి ఊదితివిు గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరేడ్వ రైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాట లాడుకొను పిల్లకాయలను పోలియున్నారు.

33 బాప్తిస్మమిచ్చు యోహాను, రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టినవాడని మీరనుచున్నారు.

34 మనుష్యకుమారుడు తినుచును, త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు.

35 అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరినిబట్టి తీర్పుపొందుననెను.

36 పరిసయ్యులలో ఒకడు తనతో కూడ భోజనము చేయవలెనని ఆయననడిగెను. ఆయన ఆ పరిసయ్యుని యింటికి వెళ్లి, భోజనపంక్తిని కూర్చుండగా

37 ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక స్త్రీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి

38 వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను.

39 ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్తయైనయెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను.

40 అందుకు యేసు సీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడు బోధకుడా, చెప్పుమనెను.

41 అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థులుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి.

42 ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను.

43 అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి

44 ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్యలేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను.

45 నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు.

46 నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను.

47 ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి

48 నీ పాపములు క్షమింపబడి యున్నవి అని ఆమెతో అనెను.

49 అప్పుడాయనతో కూడ భోజనపంక్తిని కూర్చుండినవారు పాపములు క్షమించుచున్న యితడెవడని తమలోతాము అనుకొనసాగిరి.

50 అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.