Logo

లూకా అధ్యాయము 24

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్త్రీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధియొద్దకు వచ్చి

02 సమాధిముందర ఉండిన రాయి దొరలింపబడి యుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని

03 ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు.

04 ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి.

05 వారు భయపడి ముఖములను నేల మోపియుండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు?

06 ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండినప్పుడు

07 మనుష్యకుమారుడు పాపిష్ఠులైన మనుష్యులచేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో అనిరి

08 అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసికొని

09 సమాధియొద్దనుండి తిరిగివెళ్లి యీ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి.

10 ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితో కూడ ఉన్న యితర స్త్రీలును.

11 అయితే వారి మాటలు వీరి దృష్టికి వెఱ్ఱిమాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు.

12 అయితే పేతురు లేచి, సమాధియొద్దకు పరుగెత్తికొనిపోయి వంగిచూడగా, నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగినదానినిగూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్లెను.

13 ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్లుచు

14 జరిగిన ఈ సంగతులన్నిటినిగూర్చి యొకరితోనొకరు సంభాషించుచుండిరి.

15 వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితో కూడ నడిచెను;

16 అయితే వారాయనను గుర్తుపట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.

17 ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి.

18 వారిలో క్లెయొపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా? అని ఆయనను అడిగెను.

19 ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవుని యెదుటను ప్రజలందరి యెదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై యుండెను.

20 మన ప్రధానయాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువ వేయించిరో నీకు తెలియదా?

21 ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి; ఇదిగాక యీ సంగతులు జరిగి నేటికి మూడుదినములాయెను.

22 అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధియొద్దకు వెళ్లి, ఆయన దేహమును కానక వచ్చి

23 కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.

24 మాతోకూడ ఉన్నవారిలో కొందరు సమాధియొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని, ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి.

25 అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా,

26 క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి

27 మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.

28 ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు అగపడగా

29 వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితోకూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.

30 ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా

31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.

32 అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.

33 ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగివెళ్లగా, పదునొకొండుగురు శిష్యులును వారితో కూడ ఉన్నవారును కూడివచ్చి

34 ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని

35 త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమకేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.

36 వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి--మీకు సమాధానమవుగాకని వారితో అనెను.

37 అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.

38 అప్పుడాయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల?

39 నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమునకుండవని చెప్పి

40 తన చేతులను పాదములను వారికి చూపెను.

41 అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను.

42 వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి.

43 ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను.

44 అంతట ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను

45 అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి

46 క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు

47 యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

48 ఈ సంగతులకు మీరే సాక్షులు

49 ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను.

50 ఆయన బేతనియ వరకు వారిని తీసికొనిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను.

51 వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.

52 వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగివెళ్లి

53 యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.