Logo

యోహాను అధ్యాయము 11

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి యాయెను.

02 ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.

03 అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.

04 యేసు అది విని యీ వ్యాధి మరణముకొరకు వచ్చినది కాదుగాని దేవుని కుమారుడు దానివలన మహిమపరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.

05 యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.

06 అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.

07 అటుపిమ్మట ఆయన మనము యూదయకు తిరిగివెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా

08 ఆయన శిష్యులు బోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగివెళ్లుదువా అని ఆయన నడిగిరి.

09 అందుకు యేసు పగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచినయెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు.

10 అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను.

11 ఆయన యీ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా

12 శిష్యులు ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి.

13 యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతినిగూర్చి చెప్పెననుకొనిరి.

14 కావున యేసు లాజరు చనిపోయెను,

15 మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను.

16 అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.

17 యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను.

18 బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము

19 గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారియొద్దకు వచ్చియుండిరి.

20 మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండియుండెను.

21 మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.

22 ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించునని యెరుగుదుననెను.

23 యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా

24 మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.

25 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;

26 బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.

27 ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.

28 ఆమె ఈ మాట చెప్పి వెళ్లి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్యముగా పిలిచెను.

29 ఆమె విని త్వరగా లేచి ఆయనయొద్దకు వచ్చెను.

30 యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను

31 గనుక యింటిలో మరియతో కూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి.

32 అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడి ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను.

33 ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనినెక్కడ నుంచితిరని అడుగగా,

34 వారు ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.

35 యేసు కన్నీళ్లు విడిచెను.

36 కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.

37 వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి.

38 యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను.

39 యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.

40 అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;

41 అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

42 నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.

43 ఆయన ఆలాగు చెప్పి లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా

44 చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేతవస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పెను.

45 కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి కాని

46 వారిలో కొందరు పరిసయ్యులయొద్దకు వెళ్లి యేసు చేసిన కార్యములనుగూర్చి వారితో చెప్పిరి.

47 కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.

48 మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి.

49 అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైయుండి మీకేమియు తెలియదు.

50 మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.

51 తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక

52 యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.

53 కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలోచించుచుండిరి.

54 కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగముగా సంచరింపక, అక్కడనుండి అరణ్యమునకు సమీపప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి, అక్కడ తన శిష్యులతోకూడ ఉండెను.

55 మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలోనుండి యెరూషలేమునకు వచ్చిరి.

56 వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.

57 ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్నయెడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.