Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 5

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను.

02 భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.

03 అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను.?

04 అది నీయొద్ద నున్నపుడు నీదేగదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను

05 అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను;

06 అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి.

07 ఇంచుమించు మూడుగంటల సేపటికి వాని భార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను.

08 అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను.

09 అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొనిపోవుదురని ఆమెతో చెప్పెను

10 వెంటనే ఆమె అతని పాదములయొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి.

11 సంఘమంతటికిని, ఈ సంగతులు వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను.

12 ప్రజలమధ్య అనేకమైన సూచక క్రియలును మహత్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి.

13 కడమవారిలో ఎవడును వారితో కలిసికొనుటకు తెగింపలేదు గాని

14 ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.

15 అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.

16 మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.

17 ప్రధానయాజకుడును అతనితో కూడ ఉన్నవారందరును, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని

18 అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి.

19 అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసికొని వచ్చి మీరు వెళ్లి దేవాలయములో నిలువబడి

20 ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను.

21 వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధానయాజకుడును అతనితోకూడ నున్నవారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించి వారిని తోడుకొనిరండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి.

22 బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగివచ్చి

23 చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితివిు గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి.

24 అంతట దేవాలయపు అధిపతియు ప్రధానయాజకులును ఆ మాటలు విని ఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.

25 అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా

26 అధిపతి బంట్రౌతులతో కూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను.

27 వారిని తీసికొని వచ్చి సభలో నిలువబెట్టగా

28 ప్రధానయాజకుడు వారిని చూచి మీరు ఈ నామమునుబట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను.

29 అందుకు పేతురును అపొస్తలులు నుమనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.

30 మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను.

31 ఇశ్రాయేలునకు మారుమనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్త బలముచేత హెచ్చించియున్నాడు.

32 మేమును, దేవుడు తనకు విధేయులైనవారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి.

33 వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా

34 సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను

35 ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్త సుమండి.

36 ఈ దినములకు మునుపు థూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసికొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి.

37 వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతో కూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడుకూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరిపోయిరి.

38 కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా ఈ మనుష్యులజోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును.

39 దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.

40 వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.

41 ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి

42 ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.