క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణములమీదుగా వెళ్లి థెస్సలొనీకకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజమందిరమొకటి యుండెను
02 గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు,
03 నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయి యున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పిచెప్పుచు, వారితో మూడు విశ్రాంతిదినములు తర్కించుచుండెను.
04 వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.
05 అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి
06 అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చియున్నారు; యాసోను వీరిని చేర్చుకొనియున్నాడు
07 వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి.
08 ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి.
09 వారు యాసోనునొద్దను మిగిలినవారియొద్దను జామీను తీసికొని వారిని విడుదల చేసిరి.
10 వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారువచ్చి యూదుల సమాజమందిరములో ప్రవేశించిరి.
11 వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.
12 అందుచేత వారిలో అనేకులును, ఘనతగల గ్రీసుదేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలమందియు విశ్వసించిరి.
13 అయితే బెరయలోకూడ పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలొనీకలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి.
14 వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.
15 పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొనివచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరిపోయిరి.
16 పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొనియుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.
17 కాబట్టి సమాజమందిరములలో యూదులతోను, భక్తిపరులైన వారితోను ప్రతిదినమున సంతవీధిలో తన్ను కలిసికొను వారితోను తర్కించుచు వచ్చెను.
18 ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునురుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.
19 అంతట వారు అతని వెంటబెట్టుకొని అరేయొపగు అను సభయొద్దకు తీసికొనిపోయి నీవు చేయుచున్న యీ నూతన బోధ యెట్టిదో మేము తెలిసికొనవచ్చునా?
20 కొన్ని క్రొత్తసంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొనగోరుచున్నామని చెప్పిరి.
21 ఏథెన్సు వారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్తసంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు.
22 పౌలు అరేయొపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతిదేవతాభక్తి గలవారైయున్నట్టు నాకు కనబడుచున్నది.
23 నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దానిమీద తెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.
24 జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
25 ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.
26 మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని,
27 తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.
28 మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.
29 కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు.
30 ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
31 ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చబోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
32 మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి; మరికొందరు దీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.
33 ఆలాగుండగా పౌలు వారి మధ్యనుండి వెళ్లిపోయెను.
34 అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరు నుండిరి.