Logo

2రాజులు అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొనిపోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొఱ్ఱపెట్టగా

02 ఎలీషా నావలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె నీ దాసురాలనైన నా యింటిలో నూనెకుండ యొకటియున్నది; అది తప్ప మరేమియు లేదనెను.

03 అతడు నీవు బయటికి పోయి, నీ యిరుగు పొరుగు వారందరియొద్ద దొరుకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరవు పుచ్చుకొనుము;

04 అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపలనుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి యొకతట్టున ఉంచుమని ఆమెతో సెలవియ్యగా

05 ఆమె అతనియొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను.

06 పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమియు లేవని చెప్పెను. అంతలొ నూనె నిలిచిపోయెను.

07 ఆమె దైవజనుడైన అతనియొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.

08 ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతముచేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచు వచ్చెను.

09 కాగా ఆమె తన పెనిమిటిని చూచి మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును.

10 కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీపస్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బస చేయవచ్చునని చెప్పెను.

11 ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను.

12 పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి ఈ షూనేమీయురాలిని పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు

13 అతడు నీవు ఇంత శ్రద్ధా భక్తులు మాయందు కనుపరచితివి నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్నుగూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనులలో కాపురమున్నాననెను.

14 ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని వాని నడుగగా గేహజీ ఆమెకు కుమారుడు లేడు; మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను.

15 అందుకతడు ఆమెను పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను.

16 ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి యేట ఈ రుతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని దైవజనుడవైన నా యేలినవాడా, ఆలాగు పలుకవద్దు; నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను.

17 పిమ్మట ఆ స్త్రీ గర్భ వతియై మరుసటి యేట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను.

18 ఆ బిడ్డ యెదిగిన తరువాత ఒకనాడు కోత కోయువారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకుపోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయెనే నా తలపోయెనే, అని తన తండ్రితో చెప్పెను.

19 అతడు వానిని ఎత్తుకొని తల్లియొద్దకు తీసికొనిపొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా

20 వాడు ఆ బాలుని ఎత్తికొని వాని తల్లియొద్దకు తీసికొనిపోయెను. పిల్లవాడు మధ్యాహ్నమువరకు తల్లి తొడమీద పండుకొనియుండి చనిపోయెను.

21 అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచముమీద పెట్టి తలుపువేసి బయటికి వచ్చి

22 ఒక పనివానిని ఒక గాడిదను నాయొద్దకు పంపుము;నేను దైవజనుని యొద్దకు పోయివచ్చెదనని తన పెనిమిటితో ఆమె యనగా

23 అతడు నేడు అమావాస్య కాదే; విశ్రాంతిదినము కాదే; అతనియొద్దకు ఎందుకు పోవుదువని యడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి

24 గాడిదకు గంతకట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మళముగా తోలవద్దనెను.

25 ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరమునుండి ఆమెను చూచి అదిగో ఆ షూనేమీయురాలు;

26 నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను.

27 పిమ్మట ఆమె కొండమీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్లు పట్టుకొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగుచేసెను; ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను.

28 అప్పుడు ఆమె కుమారుడు కావలెనని నేను నా యేలినవాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా? అని అతనితో మనవిచేయగా

29 అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము; ఎవరైనను నీకు ఎదురుపడినయెడల వారికి నమస్కరింపవద్దు; ఎవరైనను నీకు నమస్కరించినయెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు; అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖముమీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను.

30 తల్లి ఆ మాట విని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడ పోయెను.

31 గేహజీ వారికంటె ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెను గాని యే శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఏలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను.

32 ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడియుండుట చూచి

33 తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసి

34 మంచముమీద ఎక్కి బిడ్డమీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటిమీదను తన కండ్లు వాని కండ్లమీదను తనచేతులు వాని చేతులమీదను ఉంచి, బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను.

35 తాను దిగి యింటిలో ఇవతలనుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచముమీద ఎక్కి వానిమీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను.

36 అప్పుడతడు గేహజీని పిలిచి ఆ షూనేమీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతనియొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తికొనుమని ఆమెతో చెప్పెను.

37 అంతట ఆమె లోపలికివచ్చి అతని కాళ్లమీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తికొనిపోయెను.

38 ఎలీషా గిల్గాలునకు తిరిగిరాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండియుండగా అతడు తన పనివానిని పిలిచి పెద్దకుండ పొయిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూరవంట చేయుమని సెలవిచ్చెను.

39 అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెఱ్ఱి ద్రాక్షచెట్టును చూచి, దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండ కోసికొనివచ్చి, వాటిని తరిగి కూరకుండలో వేసెను.

40 తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలువేసి దానిని తినక మానిరి.

41 అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాని వేసి, జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను.

42 మరియు ఒకడు బయల్షాలిషానుండి మొదటిపంట బాపతు యవలపిండితో చేయబడిన యిరువది రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసికొనివచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను.

43 అయితే అతని పనివాడు నూరుమందికి వడ్డించుటకు ఇవి యెంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను.

44 పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను.