Logo

2రాజులు అధ్యాయము 7

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును.

02 అందుకు ఎవరి చేతిమీద రాజు ఆనుకొనియుండెనో ఆ యధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు నీవు కన్నులార దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను.

03 అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవువరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను?

04 పట్టణములోనికి పోవుదమనుకొంటిమా పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము; ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము; పదండి, సిరియనుల దండుపేటలోనికి, పోవుదము రండి, వారు మనలను బ్రదుకనిచ్చిన బ్రదుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని

05 సందెచీకటియందు సిరియనుల దండుపేటలోనికి పోవలెనని లేచి, సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడకపోయిరి.

06 యెహోవా రథముల ధ్వనియు గుఱ్ఱముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లు చేయగా వారు మనమీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చియున్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని

07 లేచి తమ గుడారములలోనైనను గుఱ్ఱములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నున్నవాటిలోనైనను ఏమియు తీసికొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని, సందెచీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయియుండిరి.

08 కాబట్టి ఆ కుష్ఠ రోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి యొక గుడారము జొచ్చి భోజనపానములు చేసి, అచ్చటనుండి వెండి బంగారములను బట్టలను ఎత్తికొనిపోయి దాచిపెట్టి, తిరిగివచ్చి మరియొక గుడారము జొచ్చి అచ్చటనుండి సొమ్ము ఎత్తికొనిపోయి దాచిపెట్టిరి.

09 వారు మనము చేయునది మంచిపని కాదు, నేటిదినము శుభ వర్తమానముగల దినము, మనము ఊరకొననేల? తెల్లవారువరకు మనము ఇచ్చట నుండినయెడల ఏదైన నొక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటివారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని

10 వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియనుల దండుపేటకు పోతివిు. అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుఱ్ఱములును కట్టబడిన గాడిదలును ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరును లేరని వానితో అనగా

11 వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటివారితో ఆ సమాచారము తెలియజెప్పగా

12 రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి సిరియనులు మనకు చేసినదానిని నేను మీకు చూపింతును; మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది గనుక వారు పట్టణములోనుండి బయటకు వచ్చినయెడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచనచేసి, పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను.

13 అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవి చేసెను ఇంతకుముందు ఇశ్రాయేలువారలలో బహుమంది మనుష్యులు లయమైపోయిరి గదా ఇక అయిదుగురు లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైనయెడల పట్టణమందు మిగిలియున్న రౌతులలొ అయిదుగురిని తీసికొనిపోనిమ్ము; మనము వారిని పంపి చూచెదమని చెప్పెను.

14 వారు జోడు రథములను వాటి గుఱ్ఱములను తీసికొనగా సిరియనుల సైన్యము వెనుకపోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చి పంపెను.

15 కాబట్టి వారు వారి వెనుక యొర్దాను నదివరకు పోయి, సిరియనులు తొందరగా పోవుచు, పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి, ఆ దూతలు తిరిగివచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా

16 జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను.

17 ఎవని చేతిమీద రాజు ఆనుకొనియుండెనో ఆ యధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనునియొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడుచేత అతడు మరణమాయెను.

18 మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్ననిపిండియు, రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను.

19 ఆ యధిపతియెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు నీవు కన్నులార చూచెదవుగాని దానిని తినకపోదువని ఆ యధిపతితో చెప్పెను.

20 జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను.