Logo

2రాజులు అధ్యాయము 15

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇశ్రాయేలు రాజైన యరొబాము ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా యేలనారంభించెను.

02 అతడు పదునారేండ్లవాడై యేలనారంభించి యెరూషలేమునందు ఏబది రెండు సంవత్సరములు రాజుగా ఉండెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలైన యెకొల్యా.

03 ఇతడు తన తండ్రియైన అమజ్యా చర్య యంతటిప్రకారము యెహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను.

04 ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు; ఉన్నత స్థలములయందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి.

05 యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగువరకు కుష్ఠరోగియై ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరుమీద అధికారియై దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను.

06 అజర్యా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దాని నంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

07 అజర్యా తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురములో తన పితరుల సమాధియందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయెను.

08 యూదారాజైన అజర్యా యేలుబడిలో ముప్పది యెనిమిదవ సంవత్సరమందు యరొబాము కుమారుడైన జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఆరునెలలు ఏలెను.

09 ఇతడు ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు, తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

10 యాబేషు కుమారుడైన షల్లూము అతనిమీద కుట్రచేసి, జనులు చూచుచుండగా అతనిమీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను.

11 జెకర్యా చేసిన కార్యములనుగూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

12 నీ కుమారులు నాలుగవ తరమువరకు ఇశ్రాయేలు సింహాసనముమీద ఆసీనులైయుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాటచొప్పున ఇది జరిగెను.

13 యూదారాజైన ఉజ్జియా యేలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెల దినములు ఏలెను.

14 గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలోనుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులోనుండు యాబేషు కుమారుడైన షల్లూముమీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను.

15 షల్లూము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన కుట్రనుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

16 మెనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినందరిని హతము చేసి, తిర్సాను దాని చేరువ గ్రామములనన్నిటిని కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను.

17 యూదారాజైన అజర్యా యేలుబడిలో ముప్పదితొమ్మిదవ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలువారిని ఏలనారంభించి షోమ్రోనులో పది సంవత్సరములు ఏలెను.

18 ఇతడును తన దినములన్నియు ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక యనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

19 అష్షూరు రాజైన పూలు దేశముమీదికి రాగా, మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలుచేత సంధి చేయించుకొనవలెనని రెండువేల మణుగుల వెండి పూలునకు ఇచ్చెను.

20 మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషియొద్దను ఏబదేసి తులముల వెండి వసూలుచేసి యీ ద్రవ్యమును అష్షూరు రాజునకిచ్చెను గనుక అష్షూరు రాజు దేశమును విడిచి వెళ్లిపోయెను.

21 మెనహేము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

22 మెనహేము తన పితరులతో కూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయెను.

23 యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదియవ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను.

24 ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

25 ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకహు కుట్ర చేసి, తనయొద్దనున్న గిలాదీయులైన యేబది మందితోను, అర్గోబుతోను, అరీహేనుతోను కలిసికొని షోమ్రోనులోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి, పెకహ్యాకు మారుగా రాజాయెను.

26 పెకహ్యా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని నంతటినిగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

27 యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదిరెండవ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి యిరువది సంవత్సరములు ఏలెను.

28 ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

29 ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చటనున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొనిపోయెను.

30 అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహుమీద కుట్రచేసి, అతనిమీద పడి అతని చంపి, యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదియవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను.

31 పెకహు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

32 ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున యూదారాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను.

33 అతడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమునందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తెయైన యెరూషా.

34 ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రియైన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను.

35 అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను; జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలుల నర్పించుచు ధూపము వేయుచునుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న యెత్తయిన ద్వారమును కట్టించెను.

36 యోతాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని నంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

37 ఆ దినములో యెహోవా సిరియా రాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును యూదా దేశముమీదికి పంపనారంభించెను.

38 యోతాము తన పితరులతో కూడ నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను.