Logo

2రాజులు అధ్యాయము 22

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేమునందు ముప్పదియొక సంవత్సరములు ఏలెను, అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తెయైన యెదీదా.

02 అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు, కుడి యెడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను.

03 రాజైన యోషీయా యేలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు, మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రియునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఈలాగు సెలవిచ్చెను.

04 నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయాయొద్దకు పోయి, ద్వారపాలకులు జనులయొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పుము.

05 యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించువారిచేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగుచేయుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలివారికి వారు దాని నియ్యవలెననియు

06 వడ్లవారికిని శిల్పకారులకును కాసెపని వారికిని మందిరమును బాగుచేయుటకై మ్రానులనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకును ఇయ్యవలెననియు తెలియజెప్పుము.

07 ఆ అధికారులు నమ్మకస్థులని వారిచేతికి అప్పగించిన ద్రవ్యమునుగూర్చి వారియొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి.

08 అంతట ప్రధానయాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రగ్రంథము నాకు దొరికెనని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి

09 రాజునొద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించువారిచేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి

10 యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము అప్పగించెనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను.

11 రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను.

12 తరువాత రాజు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అశాయా అను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా

13 మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలనుగూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణ చేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది.

14 కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహికామును, అక్బోరును, షాఫానును, అశాయాయును ప్రవక్త్రియగు హుల్దాయొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో రెండవ భాగమందు కాపురస్థురాలై యుండెను. ఈమెయొద్దకు వారు వచ్చి మాటలాడగా

15 ఈమె వారితో ఇట్లనెను మిమ్మును నాయొద్దకు పంపినవానితో ఈ మాట తెలియజెప్పుడి

16 యెహోవా సెలవిచ్చునదేమనగా యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడియున్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండ నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని రప్పింతును.

17 ఈ జనులు నన్ను విడిచి యితరదేవతలకు ధూపము వేయుచు, తమ సకల కార్యములచేత నాకు కోపము పుట్టించియున్నారు గనుక నా కోపము ఆరిపోకుండ ఈ స్థలముమీద రగులుకొనుచున్నది.

18 యెహోవాయొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి

19 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ స్థలము పాడగుననియు, దాని కాపురస్థులు దూషణాస్పదులగుదురనియు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి, మెత్తని మనస్సుకలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి, నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించియున్నాను.

20 నేను నిన్ను నీ పితరులయొద్ద చేర్చుదును; నీవు నెమ్మది నొందినవాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలముమీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు; ఇదే యెహోవా వాక్కు. అంతట వారు ఈ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి.