Logo

మార్కు అధ్యాయము 5

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి.

02 ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయనకెదురు పడెను.

03 వాడు సమాధులలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను.

04 పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లువేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను.

05 వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచునుండెను.

06 వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి

07 యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలువేసెను.

08 ఎందుకనగా ఆయన అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పెను.

09 మరియు ఆయన నీ పేరేమని వాని నడుగగా వాడు నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి

10 తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను.

11 అక్కడ కొండదగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను.

12 గనుక ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను.

13 యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండువేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను.

14 ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి.

15 జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి.

16 జరిగినది చూచినవారు దయ్యములు పట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా

17 తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి.

18 ఆయన దోనె యెక్కినప్పుడు, దయ్యములు పట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని

19 ఆయన వానికి సెలవియ్యక నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను.

20 వాడు వెళ్లి, యేసు తనకు చేసినవన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి.

21 యేసు మరల దోనె యెక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహు జనసమూహము ఆయనయొద్దకు కూడి వచ్చెను.

22 ఆయన సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధికారులలో యాయీరను నొకడు వచ్చి, ఆయనను చూచి ఆయన పాదములమీద పడి

23 నా చిన్నకుమార్తె చావనైయున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా

24 ఆయన అతనితో కూడ వెళ్లెను; బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి.

25 పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి

26 తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకటపడెను.

27 ఆమె యేసునుగూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని,

28 జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను.

29 వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆబాధ నివారణయైనదని గ్రహించుకొనెను.

30 వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్లెనని తనలోతాను గ్రహించి, జనసమూహమువైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా

31 ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే; నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి.

32 ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టు చూచెను.

33 అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచు వచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను.

34 అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.

35 ఆయన ఇంకను మాటలాడుచుండగా, సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమపెట్టుదువనిరి.

36 యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజమందిరపు అధికారితో చెప్పి

37 పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియ్యక

38 సమాజమందిరపు అధికారి యింటికి వచ్చి, వారు గొల్లుగానుండి చాల యేడ్చుచు, ప్రలాపించుచు నుండుట చూచి

39 లోపలికిపోయి మీరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను.

40 అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండియున్న గదిలోనికి వెళ్లి

41 ఆ చిన్నదాని చెయిపట్టి తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము.

42 వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి.

43 జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.