Logo

మార్కు అధ్యాయము 15

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఉదయము కాగానే ప్రధానయాజకులును పెద్దలును శాస్త్రులును మహాసభ వారందరును కలిసి ఆలోచన చేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్పగించిరి.

02 పిలాతు యూదుల రాజవు నీవేనా? అని ఆయననడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను.

03 ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా

04 పిలాతు ఆయనను చూచి మరల నీవు ఉత్తరమేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను.

05 అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను.

06 ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు.

07 అధికారులనెదిరించి, కలహములో నరహత్య చేసినవారితో కూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను.

08 జనులు గుంపుగా కూడివచ్చి, అతడు అదివరకు తమకు చేయుచువచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా

09 ప్రధానయాజకులు అసూయచేత యేసును అప్పగించిరని

10 పిలాతు తెలిసికొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా? అని అడిగెను.

11 అతడు బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనునట్లు ప్రధానయాజకులు వారిని ప్రేరేపించిరి.

12 అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరల వారినడిగెను.

13 వారు వానిని సిలువ వేయుమని మరల కేకలువేసిరి.

14 అందుకు పిలాతు ఎందుకు? అతడే చెడుకార్యము చేసెనని వారినడుగగా వారు వానిని సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

15 పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

16 అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికారమందిరము లోపలికి తీసికొనిపోయి, సైనికులనందరిని సమకూర్చుకొనిన తరువాత

17 ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తలమీద పెట్టి,

18 యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి.

19 మరియు రెల్లుతో ఆయన తలమీద కొట్టి, ఆయనమీద ఉమ్మివేసి, మోకాళ్లూని ఆయనకు నమస్కారము చేసిరి.

20 వారు ఆయనను అపహసించిన తరువాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువ వేయుటకు తీసికొనిపోయిరి.

21 కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి.

22 అతడు అలెక్సంద్రునకును రూఫునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసికొనివచ్చిరి. గొల్గొతా అనగా కపాలస్థలమని అర్థము.

23 అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చుకొనలేదు.

24 వారాయనను సిలువవేసి, ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లువేసి, వాటిని పంచుకొనిరి.

25 ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను.

26 మరియు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి.

27 మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని

28 ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతొకూడ సిలువ వేసిరి.

29 అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా,

30 సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి.

31 అట్లు శాస్త్రులును ప్రధానయాజకులును అపహాస్యము చేయుచు వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు.

32 ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువమీదనుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతోకూడ సిలువ వేయబడినవారును ఆయనను నిందించిరి.

33 మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.

34 మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము.

35 దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలీయాను పిలుచుచున్నాడనిరి.

36 ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింప వచ్చునేమో చూతమనెను.

37 అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను.

38 అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను.

39 ఆయనకెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి--నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి.

40 వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి.

41 ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలనేకులును వారిలో ఉండిరి.

42 ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతిదినమునకు పూర్వదినము

43 గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురుచూచువాడు.

44 పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతిని తనయొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతనినడిగెను.

45 శతాధిపతివలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను.

46 అతడు నారబట్ట కొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను.

47 మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి.