క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 అటుతరువాత ప్రభువు డెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను.
02 పంపినప్పుడాయన వారితో ఇట్లనెను కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.
03 మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్ల మధ్యకు గొఱ్ఱపిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను.
04 మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు;
05 త్రోవలో ఎవనినైనను కుశలప్రశ్నలడుగవద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడు ఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి.
06 సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగివచ్చును.
07 వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు.
08 మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీముందర పెట్టునవి తినుడి.
09 అందులో నున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి.
10 మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొనకపోయిన యెడల
11 మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళినికూడ మీ యెదుటనే దులిపివేయుచున్నాము; అయినను దేవుని రాజ్యము సమీపించియున్నదని తెలిసికొనుడని చెప్పుడి.
12 ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
13 అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు
14 అయినను విమర్శకాలమునందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వదగినదై యుండును.
15 ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు.
16 మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించుననెను.
17 ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగివచ్చి ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా
18 ఆయన సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిని.
19 ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీకెంతమాత్రమును హానిచేయదు.
20 అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి యున్నవని సంతోషించుడని వారితో చెప్పెను.
21 ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి-తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను.
22 సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింపబడియున్నది; కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో, కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడును తప్ప, మరెవడును ఎరుగడని చెప్పెను.
23 అప్పుడాయన తన శిష్యులవైపు తిరిగి-మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి;
24 అనేకమంది ప్రవక్తలును రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందు వారితో అనెను.
25 ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను.
26 అందుకాయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీవేమి చదువుచున్నావని అతని నడుగగా
27 అతడునీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు, వ్రాయబడియున్నదని చెప్పెను
28 అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను.
29 అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి, అతడు అవునుగాని నా పొరుగువాడెవడని యేసునడిగెను.
30 అందుకు యేసు ఇట్లనెను ఒక మనుష్యుడు యెరూషలేమునుండి యెరికో పట్టణమునకు దిగివెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి
31 అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను.
32 ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను.
33 అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి
34 అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను
35 మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవానికిచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను.
36 కాగా దొంగల చేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు--అతనిమీద జాలిపడినవాడే అనెను.
37 అందుకు యేసు నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను.
38 అంతట వారు ప్రయాణమైపోవుచుండగా, ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన యింట చేర్చుకొనెను.
39 ఆమెకు మరియ అను సహోదరియుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను.
40 మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను.
41 అందుకు ప్రభువు మార్తా, మార్తా, నీవనేకమైన పనులనుగూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే
42 మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.