Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 8

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి.

02 భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతనినిగూర్చి బహుగా ప్రలాపించిరి.

03 సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొనిపోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను.

04 కాబట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి.

05 అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమువరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను.

06 జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా.

07 అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలువేసి వారిని వదలిపోయెను; పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి.

08 అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను.

09 సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీచేయుచు, తానెవడో యొక గొప్పవాడని చెప్పుకొనుచు, సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను.

10 కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరు దేవుని మహాశక్తి యనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి.

11 అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరచినందున వారతని లక్ష్యపెట్టిరి.

12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి.

13 అప్పుడు సీమోను కూడ నమ్మి బాప్తిస్మముపొంది ఫిలిప్పును ఎడబాయకుండి, సూచక క్రియలును గొప్ప అద్భుతములును జరుగుట చూచి విభ్రాంతినొందెను.

14 సమరయవారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని, పేతురును యోహానును వారియొద్దకు పంపిరి.

15 వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారికొరకు ప్రార్థన చేసిరి.

16 అంతకుముందు వారిలో ఎవనిమీదను ఆయన దిగియుండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి.

17 అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి.

18 అపొస్తలులు చేతులుంచుటవలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి

19 వారియెదుట ద్రవ్యము పెట్టి నేనెవనిమీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను.

20 అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక.

21 నీ హృదయము దేవుని యెదుట సరియైనది కాదు గనుక యీ కార్యమందు నీకు పాలుపంపులు లేవు.

22 కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారుమనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును;

23 నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను.

24 అందుకు సీమోను మీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండ మీరే నాకొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను.

25 అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్లుచు, సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి.

26 ప్రభువు దూత నీవు లేచి, దక్షిణముగా వెళ్లి, యెరూషలేమునుండి గాజాకు పోవు అరణ్యమార్గమును కలసికొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్లెను.

27 అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటిమీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను.

28 అతడు తిరిగి వెళ్లుచు, తన రథముమీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను.

29 అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని చెప్పెను.

30 ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా

31 అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను.

32 అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొఱ్ఱవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను.

33 ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది.

34 అప్పుడు నపుంసకుడు ప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకని గూర్చియా?దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పునడిగెను.

35 అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను.

36 వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను.

37 ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి.

38 అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను.

39 వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరియెన్నడును చూడలేదు.

40 అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను.