పవిత్ర గ్రంథాలు

1సమూయేలు

అధ్యాయం 6

యెహోవా మందసము ఏడు నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత

ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేయుదుము? ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా

వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయ నుద్దేశించినయెడల ఊరకయే పంపక, యే విధముచేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థతనొంది ఆయన హస్తము మీ మీదనుండి యెందుకు తియ్యబడక యుండెనో మీరు తెలిసికొందురనిరి.

ఫిలిష్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారినడుగగా వారు మీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక, ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను.

కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతలమీదను మీ భూమిమీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు.

ఐగుప్తీయులును ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుతకార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి; ఇశ్రాయేలీయులు వెళ్లిపోయిరి గదా.

కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి, కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గరనుండి యింటికి తోలి

యెహోవా మందసమును ఆ బండిమీద ఎత్తి, అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి.

అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటినయెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసికొనవచ్చును; ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందుమనిరి.

వారు ఆలాగున రెండు పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటిలోపల పెట్టి

యెహోవా మందసమును బంగారు గడ్డలును పందికొక్కు రూపములును గల ఆ చిన్న పెట్టెను బండిమీద ఎత్తగా

ఆ ఆవులు రాజమార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి.

బేత్షెమెషువారు లోయలో తమ గోధుమ చేలను కోయుచుండిరి; వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను, దానిని చూచి వారు సంతోషించిరి.

ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతిదగ్గర నిలువగా, వారు బండి యొక్క కఱ్ఱలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి.

లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులుగల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతిమీద ఉంచగా, ఆ దినమున బేత్షెమెషువారు యెహోవాకు దహనబలులను అర్పించి బలులను వధించిరి.

ఫిలిష్తీయుల సర్దారులు అయిదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగివెళ్లిరి

అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదువారి నిమిత్తము ఒకటి, గాజావారి నిమిత్తము ఒకటి, అష్కెలోను వారి నిమిత్తము ఒకటి, గాతువారి నిమిత్తము ఒకటి, ఎక్రోనువారి నిమిత్తము ఒకటి.

ప్రాకారముగల పట్టణములవారేమి పొలములోని గ్రామములవారేమి ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పంది కొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యము. నేటివరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో నున్నది.

బేత్షెమెషువారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబది వేల డెబ్బదిమందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి.

అప్పుడు బేత్షెమెషువారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మనయొద్దనుండి ఆయన ఎవరి యొద్దకు పోవలెనని చెప్పి

కిర్యత్యారీము కాపురస్థులకు దూతలను పంపిఫిలిష్తీయులు యెహోవా మందసమును మరల తీసికొనివచ్చిరి; మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసికొని పోవలెనని వర్తమానము పంపిరి.