పవిత్ర గ్రంథాలు

నిర్గమకాండము

అధ్యాయం 32

మాషే కొండ దిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.

అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా

ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి.

అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.

అహరోను అది చూచి దాని యెదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా

మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులనర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.

కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు దిగివెళ్లుము; ఐగుప్తు దేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి.

నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించి ఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను.

మరియు యెహోవా ఇట్లనెను నేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.

కావున నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా

మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలమువలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల?

ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొనిపోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు

నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితో ఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమునకిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను.

అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను.

మోషే శాసనములు గల రెండు పలకలను చేతపట్టుకొని కొండదిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి; అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడియుండెను.

ఆ పలకలు దేవుడు చేసినవి; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత.

ఆ ప్రజలు పెద్దకేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా

అతడు అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను.

అతడు పాళెమునకు సమీపింపగా, ఆ దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను; అతడు కొండదిగువను తనచేతులలోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను

మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసికొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్లమీద చల్లి ఇశ్రాయేలీయులచేత దాని త్రాగించెను.

అప్పుడు మోషే నీవు ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమిచేసిరని అహరోనును నడుగగా

అహరోను నా యేలినవాడా, నీ కోపము మండనియ్యకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు.

వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము; ఐగుప్తులోనుండి మమ్మును రప్పించినవాడగు ఈ మోషే యేమాయెనో మాకు తెలియదనిరి.

అందుకు నేను ఎవరియొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడయాయెననెను.

ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టియుండెను.

అందుకు మోషే పాళెముయొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నున్నవారందరు నాయొద్దకు రండి అనగా లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి.

అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారమునుండి ద్వారమునకు వెళ్లుచు, ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను

లేవీయులు మోషే మాటచొప్పున చేయగా, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడు వేలమంది కూలిరి.

ఏలయనగా మోషే వారిని చూచి నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారునిమీద పడియేగాని తన సహోదరునిమీద పడియేగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసికొనుడనెను.

మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండయెక్కి వెళ్లెదను; ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను.

అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగివెళ్లి అయ్యో యీ ప్రజలు గొప్ప పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి.

అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాననెను.

అందుకు యెహోవా యెవడు నా యెదుట పాపము చేసెనో వాని నా గ్రంథములోనుండి తుడిచివేయుదును.

కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్లును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించెదనని మోషేతో చెప్పెను.

అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను.