హగ్గయి
అధ్యాయం 1
రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశముమీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను సైన్యములకధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా
సమయమింక రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే.
అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా
ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నిసించుటకు ఇది సమయమా?
కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.
మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.
కాగా సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.
పర్వతములెక్కి మ్రాను తీసికొనివచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
విస్తారముగా కావలెనని మీరు ఎదురుచూచితిరి గాని కొంచెముగా పండెను; మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని; ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరు మీ మీ యిండ్లు కట్టుకొనుటకు త్వరపడుటచేతనే గదా.
కాబట్టి మిమ్మునుబట్టి ఆకాశపుమంచు కురువకయున్నది, భూమి పండకయున్నది.
నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోనుచేతిపనులన్నిటి విషయములోను క్షామము పుట్టించియున్నాను.
షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధానయాజకుడునగు యెహోషువయు శేషించిన జనులందరును తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి, తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనిరి.
అప్పుడు యెహోవా దూతయైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తనుబట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే యెహోవా వాక్కు.
యెహోవా యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా
వారు కూడివచ్చి, రాజైన దర్యావేషు యొక్క యేలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల యిరువది నాలుగవ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి.