విలాపవాక్యములు
అధ్యాయం 4
బంగారము ఎట్లు మందగిలినది? మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది? ప్రతి వీధిమొగను ప్రతిష్టితమైన రాళ్లు పారవేయబడియున్నవి.
మేలిమి బంగారముతో పోల్చదగిన సీయోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరిచేసిన మంటికుండలుగా ఎంచబడుచున్నారు?
నక్కలైనను చన్నిచ్చి తమపిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి యెడారిలోని ఉష్ట్రపక్షులవలె క్రూరురాలాయెను.
దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడును వారికి పెట్టడు.
సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడినవారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు.
నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపముకంటె అధికము ఎవరును దానిమీద చెయ్యి వేయకుండనే నిమిషములో ఆ పట్టణము పాడుచేయబడెను.
దాని ఘనులు హిమముకన్న శుద్ధమైనవారు వారు పాలకంటె తెల్లనివారు వారి శరీరములు పగడములకంటె ఎఱ్ఱనివి వారి దేహకాంతి నీలమువంటిది.
అట్టివారి ఆకారము బొగ్గుకంటె నలుపాయెను వారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్టజాలరు. వారి చర్మము వారి యెముకలకు అంటుకొనియున్నది అది యెండి కఱ్ఱవంటిదాయెను.
క్షామహతులు భూఫలములు లేక పొడువబడి క్షీణించిపోయెదరు ఖడ్గహతులు క్షామహతులకన్న భాగ్యవంతులు.
వాత్సల్యముగల స్త్రీలచేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి.
యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను సీయోనులో ఆయన అగ్ని రాజబెట్టెను అది దాని పునాదులను కాల్చివేసెను.
బాధించువాడుగాని విరోధిగాని యెరూషలేము గవునులలోనికి వచ్చునని భూరాజులకైనను లోకనివాసులందరిలో మరి ఎవరికైనను తోచియుండలేదు.
దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములనుబట్టియు దాని యాజకుల దోషమునుబట్టియు
జనులు వీధులలో అంధులవలె తిరుగులాడెదరు వారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు.
పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితోననిరి. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ కాపురముండకూడదని చెప్పుకొనిరి
యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇకమీదట వారిని లక్ష్యపెట్టడు యాజకులయెడల జనులు గౌరవము చూపకపోయిరి పెద్దలమీద దయచూపకపోయిరి.
వ్యర్థసహాయముకొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనముకొరకు ఎదురుచూచుచుంటిమి.
రాజవీధులలో మేము నడువకుండునట్టు విరోధులు మా జాడలనుబట్టి వెంటాడుదురు మా అంత్యదశ సమీపమాయెను మా దినములు తీరిపోయినవి మా అంత్యదశ వచ్చేయున్నది.
మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజులకన్న వడిగలవారు పర్వతములమీద వారు మమ్మును తరుముదురు అరణ్యమందు మాకొరకు పొంచియుందురు.
మాకు నాసికారంధ్రముల ఊపిరివంటివాడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను.
అతని నీడక్రిందను అన్యజనులమధ్యను బ్రదికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు ఎదోముకుమారీ, సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసికొందువు
సీయోనుకుమారీ, నీ దోషశిక్ష సమాప్తమాయెను ఇకమీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు ఎదోముకుమారీ, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును నీ పాపములను ఆయన వెల్లడిపరచును.