పవిత్ర గ్రంథాలు

జెకర్యా

అధ్యాయం 5

నేను మరల తేరిచూడగా ఎగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడెను.

నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా నేను, ఇరువైమూరల నిడివియు పదిమూరల వెడల్పునుగల యెగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడుచున్నదంటిని.

అందుకతడు నాతో ఇట్లనెను ఇది భూమియంతటి మీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు; రెండవ ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు.

ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును.

అప్పుడు నాతో మాటలాడుచున్న దూత బయలువెళ్లి నీవు నిదానించి చూచి ఇవతలకు వచ్చునదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా

ఇదేమిటియని నేనడిగితిని. అందుకతడు ఇది కొల, ఇది బయలువెళ్లు తూము అనెను; మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుదురని చెప్పెను.

అప్పుడు సీసపుబిళ్లను తీయగా కొలతూములో కూర్చున్న యొక స్త్రీ కనబడెను.

అప్పుడతడు ఇది దోషమూర్తియని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపుబిళ్లను తూముమీద నుంచెను.

నేను మరల తేరిచూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిరి; సంకుబుడి కొంగ రెక్కలవంటి రెక్కలు వారికుండెను, గాలి వారి రెక్కలను ఆడించుచుండెను, వారు వచ్చి తూమును భూమ్యాకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి.

వీరు ఈ తూమును ఎక్కడికి తీసికొని పోవుదురని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా

షీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు; అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠముమీద పెట్టి యుంచుదురని అతడు నాకుత్తరమిచ్చెను.