పవిత్ర గ్రంథాలు

యెహెజ్కేలు

అధ్యాయం 2

నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలెను అని

ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికివచ్చి నన్ను నిలువబెట్టెను; అప్పుడు నాతో మాటలాడినవాని స్వరము వింటిని.

ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నామీద తిరుగుబాటు చేసిన జనులయొద్దకు ఇశ్రాయేలీయులయొద్దకు నిన్ను పంపుచున్నాను; వారును వారి పితరులును నేటివరకును నామీద తిరుగుబాటు చేసినవారు.

వారు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై యున్నారు, వారియొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయువారు

గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలిసికొనునట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను.

నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్లతుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు;

అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము.

వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము.

నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరుతెరచి నేనిచ్చుదాని భుజించుము అనెను.

నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన యొక చెయ్యి నాయొద్దకు చాపబడెను. ఆయన దాని నాముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై యుండెను; మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడియుండెను.