పవిత్ర గ్రంథాలు

యెహెజ్కేలు

అధ్యాయం 32

మరియు పండ్రెండవ సంవత్సరము పండ్రెండవ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోనుగూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము జనములలో కొదమసింహమువంటి వాడవని నీవు ఎంచబడితివి, జలములలో మొసలివంటివాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి, వాటి వాగులను బురదగా చేసితివి.

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నావలను నీమీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు.

నేను నిన్ను నేల పడవేసి తెరపనేలమీద పారవేసెదను, ఆకాశపక్షులన్నియు నీమీద వ్రాలునట్లుచేసి నీవలన భూజంతువులన్నిటిని కడుపార తిననిచ్చెదను,

నీ మాంసమును పర్వతములమీద వేసెదను, లోయలన్నిటిని నీ కళేబరములతో నింపెదను.

మరియు భూమిని నీ రక్తధారచేత పర్వతములవరకు నేను తడుపుదును, లోయలు నీతో నింపబడును.

నేను నిన్ను ఆర్పివేసి ఆకాశమండలమును మరుగుచేసెదను, నక్షత్రములను చీకటి కమ్మజేసెదను, సూర్యుని మబ్బుచేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును.

నిన్నుబట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతులకన్నిటికిని అంధకారము కమ్మజేసెదను, నీ దేశముమీద గాఢాంధకారము వ్యాపింపజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్లగొట్టి, జనములలో నీకు సమూలధ్వంసము కలుగజేసి బహు జనములకు కోపము పుట్టింతును,

నా ఖడ్గమును నేను వారిమీద ఝళిపించెదను, నిన్నుబట్టి చాలమంది జనులు కలవరించుదురు, వారి రాజులును నిన్నుబట్టి భీతులగుదురు, నీవు కూలు దినమున వారందరును ఎడతెగక ప్రాణభయముచేత వణకుదురు.

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా బబులోనురాజు ఖడ్గము నీమీదికి వచ్చును,

శూరుల ఖడ్గములచేత నేను నీ సైన్యమును కూల్చెదను, వారందరును జనములలో భయంకరులు; ఐగుప్తీయుల గర్వము నణచివేయగా దాని సైన్యమంతయు లయమగును.

మరియు గొప్పప్రవాహముల దరినున్న పశువులనన్నిటిని నేను లయపరచెదను, నరుని కాలైనను పశువు కాలైనను వాటిని కదలింపకయుండును.

అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండజేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

నేను ఐగుప్తు దేశమును పాడుచేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులనందరిని నిర్మూలము చేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

ఇది అంగలార్పు వచనము, వారు దానిని యెత్తి పాడుదురు, అన్యజనుల కుమార్తెలు దానిని యెత్తి పాడుదురు; ఐగుప్తునుగూర్చియు అందులోని సమూహమునుగూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

పండ్రెండవ సంవత్సరము నెల పదునైదవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

నరపుత్రుడా, అల్లరిచేయు ఐగుప్తీయుల సమూహమునుగూర్చి అంగలార్చుము, ప్రసిద్ధినొందిన జనముల కుమార్త్తెలు భూమిక్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకు పోయిన వారియొద్దకును వారిని పడవేయుము.

సౌందర్యమందు నీవు ఎవనిని మించినవాడవు? దిగి సున్నతినొందని వారియొద్ద పడియుండుము.

ఖడ్గముచేత హతమైన వారిమధ్య వారు కూలుదురు, అది కత్తిపాలగును, దానిని దాని జనులను లాగి పడవేయుడి.

వారు దిగిపోయిరే, సున్నతినొందని వీరు ఖడ్గముచేత హతమై అక్కడ పడియుండిరే, అని యందురు; పాతాళములోనున్న పరాక్రమశాలురలో బలాఢ్యులు దానిగూర్చియు దాని సహాయులనుగూర్చియు అందురు.

అష్షూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి, దాని చుట్టును వారి సమాధులున్నవి, వారందరు కత్తిపాలై చచ్చియున్నారు.

దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి, దాని సమూహము దాని సమాధిచుట్టు నున్నది, వారందరు సజీవుల లోకములో భయంకరులైన వారు, వారు కత్తిపాలై చచ్చిపడియుండిరి.

అక్కడ ఏలామును దాని సమూహమును సమాధిచుట్టు నున్నవి; అందరును కత్తిపాలై చచ్చిరి; వారు సజీవుల లోకములో భయంకరులైనవారు, వారు సున్నతిలేనివారై పాతాళములోనికి దిగిపోయిరి, గోతిలోనికి దిగిపోయినవారితో కూడ వారు అవమానము నొందుదురు.

హతులైన వారిమధ్య దానికిని దాని సమూహమునకును పడకయొకటి ఏర్పడెను, దాని సమాధులు దానిచుట్టు నున్నవి; వారందరును సున్నతి లేనివారై హతులైరి; వారు సజీవులలోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయినవారితో కూడ వారును అవమానము నొందుదురు, హతులైన వారిమధ్య అది యుంచబడును.

అక్కడ మెషెకును తుబాలును దాని సమూహమును ఉన్నవి; దాని సమాధులు దాని చుట్టునున్నవి. వారందరు సున్నతిలేనివారు, సజీవుల లోకములో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి, ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయిరి.

అయితే వీరు సున్నతిలేని వారిలో పడిపోయిన శూరులదగ్గర పండుకొనరు; వారు తమ యుధ్దాయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి, తమ ఖడ్గములను తలలక్రింద ఉంచుకొని పండుకొందురు; వీరు సజీవుల లోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి యెముకలకు తగిలెను.

నీవు సున్నతిలేనివారి మధ్య నాశనమై కత్తిపాలైన వారియొద్ద పండుకొందువు.

అక్కడ ఎదోమును దాని రాజులును దాని అధిపతులందరును ఉన్నారు; వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారియొద్ద ఉంచబడిరి; సున్నతిలేని వారియొద్దను పాతాళములోనికి దిగిపోయిన వారియొద్దను వారును పండుకొనిరి.

అక్కడ ఉత్తరదేశపు అధిపతులందురును సీదోనీయులందరును హతమైన వారితో దిగిపోయియున్నారు; వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొందియున్నారు; సున్నతిలేనివారై కత్తిపాలైన వారిమధ్య పండుకొనియున్నారు; గోతిలోనికి దిగిపోయిన వారితోపాటు వారును అవమానము నొందుదురు.

కత్తిపాలైన ఫరోయు అతనివారందరును వారినిచూచి తమ సమూహమంతటినిగూర్చి ఓదార్పు తెచ్చుకొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

సజీవుల లోకములో అతనిచేత భయము పుట్టించితిని గనుక ఫరోయు అతని వారందరును కత్తిపాలైన వారియొద్ద సున్నతిలేనివారితో కూడ పండుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.