పవిత్ర గ్రంథాలు

ఆదికాండము

అధ్యాయం 9

మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధిపొంది భూమిని నింపుడి.

మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీచేతికప్పగింపబడి యున్నవి.

ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూరమొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.

అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.

మరియు మీకు ప్రాణమైన మీ రక్తమునుగూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమునుగూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.

నరుని రక్తమును చిందించువాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.

మీరు ఫలించి అభివృద్ధినొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.

మరియు దేవుడు నోవహు అతని కుమారులతో

ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోకూడ నున్న ప్రతి జీవితోను,

పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.

నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహజలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను.

మరియు దేవుడు నాకును మీకును మీతోకూడ నున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే.

మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును.

భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును.

అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు

ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీద నున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను.

మరియు దేవుడు నాకును భూమిమీద నున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.

ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి.

ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.

నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను.

పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను.

అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను.

అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచివెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుటవలన తమ తండ్రి దిసమొలను చూడలేదు

అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసిన దానిని తెలిసికొని

కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.

మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక కనాను అతనికి దాసుడగును.

దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.

ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబది యేండ్లు బ్రదికెను.

నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.