పవిత్ర గ్రంథాలు

యిర్మియా

అధ్యాయం 47

ఫరో గాజాను కొట్టకమునుపు ఫిలిష్తీయులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జలములు ఉత్తరదిక్కునుండి పొర్లి వరదలై మనుష్యులు మొఱ్ఱపెట్టునట్లుగాను దేశనివాసులందరు అంగలార్చునట్లు గాను, దేశముమీదను అందున్న సమస్తముమీదను పట్టణముమీదను దానిలో నివసించు వారిమీదను ప్రవహించును.

వారి బలమైన గుఱ్ఱముల డెక్కలు నేలతన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుమువంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగిచూడరు.

ఫిలిష్తీయులనందరిని లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండ అందరిని నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును,

గాజా బోడియాయెను, మైదానములో శేషించిన ఆష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్లవరకు నిన్ను నీవే గాయపరచుకొందువు?

యెహోవా ఖడ్గమా, యెంతవరకు విశ్రమింపక యుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము.

అష్కెలోను మీదికిని సముద్ర తీరము మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గదా; నీవేలాగు విశ్రమించుదువు? అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.