పవిత్ర గ్రంథాలు

యిర్మియా

అధ్యాయం 37

బబులోనురాజైన నెబుకద్రెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషీయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను.

అతడైనను అతని సేవకులైనను దేశప్రజలైనను యెహోవా ప్రవక్తయైన యిర్మీయాచేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు.

రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహు కలును యాజకుడైన మయశేయా కుమారుడగు జెఫన్యాను ప్రవక్తయైన యిర్మీయాయొద్దకు పంపి దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుమని మనవిచేసెను.

అప్పటికి వారు యిర్మీయాను చెరసాలలో నుంచియుండలేదు; అతడు ప్రజలమధ్య సంచరించుచుండెను.

ఫరో దండు ఐగుప్తులోనుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడివేయుచున్న కల్దీయులు సమాచారము విని యెరూషలేము దగ్గరనుండి బయలుదేరిరి.

అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నాయొద్ద విచారించుడని నిన్ను నాయొద్దకు పంపిన యూదా రాజుతో నీవీలాగు చెప్పవలెను మీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగివెళ్లును.

కల్దీయులు తిరిగివచ్చి యీ పట్టణముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చివేయుదురు.

యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు కల్దీయులు నిశ్చయముగా మాయొద్దనుండి వెళ్లెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్లనేవెళ్లరు.

మీతో యుద్ధముచేయు కల్దీయుల దండువారినందరిని మీరు హతముచేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలోనుండి వచ్చి యీ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు.

ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుటనుండి వెళ్లిపోగా

యిర్మీయా బెన్యామీను దేశములో తనవారియొద్ద భాగము తీసికొనుటకై యెరూషలేమునుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా

ఇరీయా అను కావలివారి అధిపతి అక్కడనుండెను. అతడు హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొని నీవు కల్దీయులలో చేరబోవుచున్నావని చెప్పగా

యిర్మీయా అది అబద్దము, నేను కల్దీయులలో చేరబోవుటలేదనెను. అయితే అతడు యిర్మీయామాట నమ్మనందున ఇరీయా యిర్మీయాను పట్టుకొని అధిపతులయొద్దకు తీసికొనివచ్చెను.

అధిపతులు యిర్మీయామీద కోపపడి అతని కొట్టి, తాము బందీగృహముగా చేసియున్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి.

యిర్మీయా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను; పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి,

అతని తన యింటికి పిలిపించి యెహోవా యొద్దనుండి ఏ మాటైనను వచ్చెనా అని యడుగగా యిర్మీయా--నీవు బబులోను రాజుచేతికి అప్పగింపబడెదవను మాట వచ్చెననెను.

మరియు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇట్లనెను నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి?

బబులోను రాజు మీమీదికైనను ఈ దేశముమీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు?

రాజా, నా యేలినవాడా, చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము, నేను అక్కడ చనిపోకుండునట్లు లేఖికుడైన యెనాతాను ఇంటికి నన్ను మరల పంపకుము.

కాబట్టి రాజైన సిద్కియా సెలవియ్యగా బంటులు బందీగృహశాలలో యిర్మీయాను వేసి, పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచు వచ్చిరి; ఇట్లు జరుగగా యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.