పవిత్ర గ్రంథాలు

లూకా

అధ్యాయం 9

ఆయన తన పండ్రెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి

దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారినంపెను.

మరియు ఆయన మీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొనిపోవద్దు; రెండు అంగీలు ఉంచుకొనవద్దు.

మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి.

మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను.

వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, (రోగులను) స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి.

చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యములన్నిటినిగూర్చి విని, యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలోనుండి లేచెననియు,

కొందరు ఏలీయా కనబడెననియు; కొందరు పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి.

అప్పుడు హేరోదు నేను యోహానును తలగొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను.

అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నియు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంటబెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను.

జనసమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థపరచెను.

ప్రొద్దుగ్రుంక నారంభించినప్పుడు పండ్రెండుగురు శిష్యులు వచ్చి మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, ఆహారము సంపాదించుకొనునట్లు జనసమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి.

ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు; మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి.

వచ్చినవారు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు. ఆయన వారిని ఏబదేసిమంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా,

వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి.

అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను.

వారందరుతిని తృప్తిపొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపెళ్లెత్తిరి.

ఒకప్పుడాయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనయొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారినడుగగా

వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయాయనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచున్నారనిరి.

అందుకాయన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురు నీవు దేవుని క్రీస్తువనెను.

ఆయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి

మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధానయాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను.

మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.

తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును.

ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టుకొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము?

నన్నుగూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో వానిగూర్చి మనుష్యకుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.

ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచిచూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాననెను.

ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెనిమిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థన చేయుటకు ఒక కొండ యెక్కెను.

ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను.

మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అనువారు.

వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడుచుండిరి.

పేతురును అతనితో కూడ ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతో కూడ నిలిచియున్న యిద్దరు పురుషులను చూచిరి.

(ఆ యిద్దరు పురుషులు) ఆయన యొద్దనుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను.

అతడీలాగు మాటలాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి.

మరియు ఈయన నేనేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.

ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకుండిరి.

మరునాడు వారు ఆ కొండదిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను.

ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు.

ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలి వదలకుండును.

దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను.

అందుకు యేసు విశ్వాసములేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసికొనిరమ్మని చెప్పెను.

వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడించెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరచి వాని తండ్రికప్పగించెను.

గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి.

ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను.

అయితే వారామాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగుచేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.

తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా

యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి.

ఈ చిన్నబిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను

యోహాను ఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను.

అందుకు యేసు మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కానివాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను.

ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు

ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని

ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు.

శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా, ఆకాశమునుండి అగ్నిదిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా,

ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.

అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి.

వారు మార్గమున వెళ్లుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్లినను నీవెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను.

అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.

ఆయన మరియొకనితో నా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను

అందుకాయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను.

మరియొకడు ప్రభువా, నీవెంట వచ్చెదను గాని నా యింటనున్న వారియొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా

యేసు నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను.