పవిత్ర గ్రంథాలు

లూకా

అధ్యాయం 19

ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి

దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు

యేసు ఎవరోయని చూడగోరెను గాని, పొట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుటవలన చూడలేకపోయెను.

అప్పుడు యేసు ఆ త్రోవను రానైయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడిచెట్టెక్కెను.

యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా

అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.

అందరు అదిచూచి ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి.

జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.

అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది.

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.

వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా,

రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై

తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మినాలనిచ్చి నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను.

అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మా కిష్టములేదని అతని వెనుక రాయబారము పంపిరి.

అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగివచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను.

మొదటివాడాయన యెదుటికి వచ్చి అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా

అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణములమీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.

అంతట రెండవవాడు వచ్చి అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా

అతడు నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.

అంతట మరియొకడు వచ్చి అయ్యా, యిదిగో నీ మినా;

నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయువాడవునైన కఠినుడవు గనుక, నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను.

అందుకతడు చడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తువాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా

నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసియుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి

వీనియొద్దనుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను.

వారు అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి.

అందుకతడు కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును, లేనివాని యొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను.

మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.

యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్లవలెనని ముందు సాగిపోయెను.

ఆయన ఒలీవలకొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, తన శిష్యులనిద్దరిని పిలిచి

మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిదపిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు

ఎవరైనను మీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్ము నడిగినయెడల ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను.

పంపబడిన వారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని

ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు, గాడిదపిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి.

అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి.

తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్లమీద తమ బట్టలువేసి, యేసును దానిమీద ఎక్కించి,

ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగున పరచిరి.

ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు

ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శబ్దముతో దేవుని స్త్రోత్రము చేయసాగిరి

ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా

ఆయన వారిని చూచి వీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలువేయునని మీతో చెప్పుచున్నాననెను.

ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి

నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి.

(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టుకట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి

నీలో రాతిమీద రాయి నిలిచియుండనియ్యని దినములు వచ్చునని చెప్పెను.

ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడియున్నది.

అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్టనారంభించెను.

ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు, ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను నాశనముచేయ జూచుచుండిరి గాని

ప్రజలందరు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొనియుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు.