పవిత్ర గ్రంథాలు

ప్రకటన

అధ్యాయం 12

అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను

ఆమె గర్భిణియై ప్రసవవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను.

అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహా ఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటములుండెను.

దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను.

సమస్త జనములను ఇనుప దండముతో ఏలనైయున్న యొక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనము నొద్దకును కొనిపోబడెను.

ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.

అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా

ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను.

కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.

మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవుని యెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.

వారు గొఱ్ఱపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు.

అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చి యున్నాడని చెప్పెను

ఆ ఘటసర్పము తాను భూమిమీద పడద్రోయబడి యుండుట చూచి, ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను;

అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండ ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింపబడెను

కావున ఆ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెను గాని

భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము, తన నోటనుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను.

అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించినవారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను