పవిత్ర గ్రంథాలు

ప్రకటన

అధ్యాయం 4

ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసిన వాటిని నీకు కనుపరచెదననెను

వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీసుడై యుండెను,

ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి యుండెను.

సింహాసనము చుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.

ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు.

మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను.

మొదటి జీవి సింహము వంటిది; రెండవ జీవి దూడ వంటిది;మూడవ జీవి మనుష్యుని ముఖమువంటి ముఖము గలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజు వంటిది.

ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.

ఆ సింహాసనమునందు ఆసీనుడై యుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా

ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు

ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి