Logo

యోహాను అధ్యాయము 12

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి.

02 మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతో కూడ భోజమునకు కూర్చున్నవారిలో ఒకడు.

03 అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను

04 ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా

05 యీ అత్తరెందుకు మూడువందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను.

06 వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బుసంచి యుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.

07 కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి;

08 బీదలు ఎల్లప్పుడును మీతోకూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను.

09 కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరునుకూడ చూడవచ్చిరి.

10 అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక

11 ప్రధానయాజకులు లాజరునుకూడ చంప నాలోచనచేసిరి.

12 మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని

13 ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.

14 సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు

15 అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.

16 ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయననుగూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి.

17 ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతులలోనుండి అతని లేపినప్పుడు, ఆయనతో కూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి.

18 అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి.

19 కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమైపోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి.

20 ఆ పండుగలో ఆరాధింప వచ్చినవారిలో కొందరు గ్రీసుదేశస్థులు ఉండిరి.

21 వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా

22 ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి.

23 అందుకు యేసు వారితో ఇట్లనెను మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది.

24 గోధుమగింజ భూమిలోపడి చావకుండినయెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును.

25 తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

26 ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.

27 ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నే నేమందును?తండ్రీ, యీ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని;

28 తండ్రీ, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతట నేను దానిని మహిమపరచితిని, మరల మహిమపరతును అని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

29 కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి.

30 అందుకు యేసు ఈ శబ్దము నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెను.

31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును;

32 నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.

33 తాను ఏవిధముగా మరణము పొందవలసియుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను.

34 జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్యకుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి.

35 అందుకు యేసు ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు

36 మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.

37 యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.

38 ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను.

39 ఇందుచేత వారు నమ్మలేకపోయిరి, ఏలయనగా

40 వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను.

41 యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను.

42 అయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి గాని, సమాజములోనుండి వెలివేయబడుదుమేమోయని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు.

43 వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.

44 అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.

45 నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.

46 నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.

47 ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండినయెడల నేనతనికి తీర్పు తీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని.

48 నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.

49 ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.

50 మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పినప్రకారము చెప్పుచున్నాననెను.