Logo

యోహాను అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యోహానుకంటె యేసు ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పడు

02 ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగివెళ్లెను.

03 అయినను యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి.

04 ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక

05 యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.

06 అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావియొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.

07 సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను.

08 ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి.

09 ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.

10 అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను

11 అప్పుడా స్త్రీ అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును?

12 తానును తన కుమాళ్లును, పశువులును, యీ బావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను.

13 అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును;

14 నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటిబుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.

15 ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా

16 యేసు నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను.

17 ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే;

18 నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.

19 అప్పుడా స్త్రీ అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.

20 మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను

21 అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతముమీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;

22 మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.

23 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించుకాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు (మూలభాషలో - వెదుకుచున్నాడు)

24 దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.

25 ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా

26 యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.

27 ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావలెనని యైనను, ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావని యైనను ఎవడును అడుగలేదు.

28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి

29 మీరు వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా

30 వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయనయొద్దకు వచ్చుచుండిరి.

31 ఆ లోగా శిష్యులు బోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి.

32 అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా

33 శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.

34 యేసు వారిని చూచి నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది.

35 ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను.

36 విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు.

37 విత్తువాడొకడు కోయువాడొకడను మాట యీ విషయములో సత్యమే.

38 మీరు దేనినిగూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను.

39 నేను చేసినవన్నియు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీయొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.

40 ఆ సమరయులు ఆయనయొద్దకు వచ్చి, తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను.

41 ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇకమీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక

42 మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.

43 ఆ రెండు దినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలయకు వెళ్లెను.

44 ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చెను.

45 గలిలయులుకూడ ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నియు వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.

46 తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగివచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగియైయుండెను.

47 యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను.

48 యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను.

49 అందుకా ప్రధాని ప్రభువా, నా కుమారుడు చావకమునుపే రమ్మని ఆయనను వేడుకొనెను.

50 యేసు నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయెను.

51 అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి, అతని కుమారుడు బ్రదికియున్నాడని తెలియజెప్పిరి.

52 ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి.

53 నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమ్మిరి.

54 ఇది యేసు యూదయనుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ.