1దినవృత్తాంతములు
అధ్యాయం 18
వారిని లోపరచి, గాతు పట్టణమును దాని గ్రామములును ఫిలిష్తీయుల వశమున నుండకుండ వాటిని పట్టుకొనెను.
అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పముకట్టు దాసులైరి.
సోబా రాజైన హదరెజెరు యూఫ్రటీసు నదివరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి
అతనియొద్దనుండి వెయ్యి రథములను ఏడువేల గుఱ్ఱపు రౌతులను ఇరువదివేల కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో నూరింటికి కావలసిన గుఱ్ఱములను ఉంచుకొని కడమవాటికన్నిటికి చీలమండ నరములు తెగవేయించెను.
సోబా రాజైన హదరెజెరునకు సహాయము చేయవలెనని దమస్కులోని సిరియనులు రాగా దావీదు ఆ సిరియనులలో ఇరువదిరెండు వేలమందిని హతము చేసెను.
తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను; సిరియనులు దావీదునకు కప్పముకట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతనికి సహాయము చేయుచు వచ్చెను.
మరియు హదరెజెరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసికొని యెరూషలేమునకు చేర్చెను.
హదరెజెరుయొక్క పట్టణములైన టిబ్హతులోనుండియు, కూనులోనుండియు దావీదు బహు విస్తారమైన యిత్తడిని తీసికొనివచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములును ఇత్తడి వస్తువులను చేయించెను.
దావీదు సోబా రాజైన హదరెజెరుయొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహూకు వినబడెను.
హదరెజెరునకును తోహూకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదరెజెరుతో యుద్ధముచేసి అతని నోడించినందుకై దావీదుయొక్క క్షేమము తెలిసికొనుటకును, అతనితో శుభవచనములు పలుకుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి, తోహూ తన కుమారుడైన హదోరమును అతనియొద్దకు పంపెను.
ఈ వస్తువులను కూడ రాజైన దావీదు తాను ఎదోమీయులయొద్ద నుండియు, మోయాబీయులయొద్ద నుండియు, అమ్మోనీయులయొద్ద నుండియు, ఫిలిష్తీయులయొద్ద నుండియు, అమాలేకీయులయొద్ద నుండియు తీసికొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను.
మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో పదునెనిమిది వేల మందిని హతము చేసెను.
దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను, ఎదోమీయులందరును అతనికి సేవకులైరి, దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతని రక్షించెను.
ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరిమీదను రాజైయుండి తన జనులందరికిని నీతిన్యాయములను జరిగించెను.
సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతియై యుండెను; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద నుండెను;
అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు, షవ్షా శాస్త్రి;
యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతియై యుండెను; మరియు దావీదుయొక్క కుమారులు రాజునకు సహాయులై యుండిరి.