2రాజులు
అధ్యాయం 25
అతని యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టును ముట్టడిదిబ్బలు కట్టిరి.
ఈ ప్రకారము రాజైన సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడియుండగా
నాల్గవ నెల తొమ్మిదవ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను, దేశపు జనులకు ఆహారము లేకపోయెను.
కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి.
అయితే కల్దీయులు పట్టణముచుట్టు ఉండగా రాజు మైదానమునకు పోవుమార్గమున వెళ్లిపోయెను; కల్దీయుల సైన్యము రాజును తరిమి, అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున యెరికో మైదానమందు అతని పట్టుకొనిరి.
వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసికొనిపోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను.
సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి యిత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసికొనిపోయిరి.
మరియు బబులోనురాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో పందొమ్మిదవ సంవత్సరమందు అయిదవ నెల యేడవ దినమున రాజదేహసంరక్షకులకు అధిపతియు బబులోనురాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి
యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న యిండ్లన్నిటిని గొప్పవారి యిండ్లన్నిటిని అగ్నిచేత కాల్పించెను.
మరియు రాజదేహసంరక్షకుల అధిపతియొద్దనున్న కల్దీయుల సైనికులందరును యెరూషలేము చుట్టునున్న ప్రాకారములను పడగొట్టిరి.
పట్టణమందు మిగిలియుండిన వారిని, బబులోనురాజు పక్షము చేరినవారిని, సామాన్య జనులలో శేషించినవారిని రాజదేహసంరక్షకుల అధిపతియైన నెబూజరదాను చెరగొనిపోయెను గాని
వ్యవసాయదారులును ద్రాక్షతోట వారును ఉండవలెనని దేశపు బీదజనములో కొందరిని ఉండనిచ్చెను.
మరియు యెహోవా మందిరమందున్న యిత్తిడి స్తంభములను మట్లను యెహోవా మందిరమందున్న యిత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి, ఆ యిత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోయిరి.
సేవకొరకై యుంచబడిన పాత్రలను చేటలను ముండ్లను ధూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటిని వారు తీసికొనిపోయిరి.
అగ్నిపాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహసంరక్షకుల అధిపతి తీసికొనిపోయెను.
మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసికొనిపోయెను. ఈ యిత్తడి వస్తువులయెత్తు లెక్కకు మించియుండెను.
ఒక్కొక స్తంభపు నిడివి పదునెనిమిది మూరలు. దాని పైపీట యిత్తడిది, పైపీట నిడివి మూడు మూరలు. మరియు ఆ పైపీట చుట్టు ఉన్న అల్లికలును దానిమ్మపండ్లును ఇత్తడివి; రెండవ స్తంభమును వీటివలె అల్లికపని కలిగియుండెను.
రాజదేహసంరక్షకుల అధిపతి ప్రధానయాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను.
మరియు ఆయుధస్థులమీద నియమింపబడియున్న అధిపతిని, పట్టణములోనుండి తీసికొని, రాజు సముఖమును కనిపెట్టుకొని యుండువారిలో పట్టణమందు దొరకిన అయిదుగురిని, దేశపుజనులను సంఖ్య చేయువారి అధిపతియొక్క లేఖికుని, సామాన్యజనులలో పట్టణమందు దొరకిన అరువదిమందిని పట్టుకొనెను.
రాజదేహసంరక్షకుల అధిపతియగు నెబూజరదాను వీరిని తీసికొని రిబ్లా పట్టణమందున్న బబులోనురాజునొద్దకు రాగా
బబులోనురాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఈ రీతిగా యూదా వారు తమ దేశములోనుండి ఎత్తికొనిపోబడిరి.
బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారిమీద అతడు షాఫానునకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించెను.
యూదావారి సైన్యాధిపతులందరును వారి జనులందరును బబులోనురాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని, మిస్పా పట్టణమందున్న గెదల్యాయొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడగు శెరాయాయును, మాయకాతీయుడైన యొకనికిపుట్టిన యజన్యాను కూడి రాగా
గెదల్యా వారితోను వారి జనులతోను ప్రమాణముచేసి కల్దీయులకు మనము దాసులమైతిమని జడియవద్దు, దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవచేసినయెడల మీకు మేలు కలుగునని చెప్పెను.
అయితే ఏడవ మాసమందు రాజ వంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు పదిమంది మనుష్యులను పిలుచుకొని వచ్చి గెదల్యామీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతనియొద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతముచేసెను.
అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరును, సైన్యాధిపతులును, లేచి కల్దీయుల భయముచేత ఐగుప్తు దేశమునకు పారిపోయిరి.
యూదారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన ముప్పదియేడవ సంవత్సరమున పండ్రెండవ నెల యిరువది యేడవ దినమున బబులోనురాజైన ఎవీల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీగృహములోనుండి యూదారాజైన యెహోయాకీనును తెప్పించి
అతనితో దయగా మాటలాడి, అతని పీఠమును బబులోనులో తనయొద్దనున్న రాజుల పీఠములకంటె ఎత్తుచేసెను.
కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్ర ములను ధరించుకొని తాను బ్రదికిన దినములన్నియు రాజు సన్నిధిని భోజనముచేయుచు వచ్చెను.
మరియు అతని బత్తెము ఏనాటికి ఆనాడు రాజుచేత నిర్ణయింపబడినదై అతడు బ్రదికినన్నాళ్లు ఆ చొప్పున అతని కియ్యబడుచుండెను.