పవిత్ర గ్రంథాలు

ద్వితియోపదేశాకాండము

అధ్యాయం 3

మనము తిరిగి బాషాను మార్గమున వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరును ఎద్రెయీలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి యెదురుగా రాగా

యెహోవా నాతో ఇట్లనెను అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీచేతికి అప్పగించియున్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలెనని చెప్పెను.

అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మనచేతికి అప్పగించెను; అతనికి శేషమేమియు లేకుండ అతనిని హతము చేసితివిు.

ఆ కాలమున అతని పురములన్నిటిని పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురమొకటియు లేదు. బాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటనున్న అరువది పురములను పట్టుకొంటిమి.

ఆ పురములన్నియు గొప్ప ప్రాకారములు గవునులు గడియలును గల దుర్గములు. అవియు గాక ప్రాకారములేని పురములనేకములను పట్టుకొంటిమి.

మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితివిు; ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితివిు;

వారి పశువులనన్నిటిని ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసికొంటిమి.

ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండవరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల యిద్దరు రాజులయొద్దనుండి పట్టుకొంటిమి.

సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమోరీయులు దానిని శెనీరని అందురు.

మైదానమందలి పురములన్నిటిని బాషానునందలి ఓగు రాజ్య పురములైన సల్కా ఎద్రెయీ అనువాటివరకు గిలాదంతటిని బాషానును పట్టుకొంటిమి.

రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా? దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు.

అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్నెములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశమును, దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని.

ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును గిలాదులో మిగిలినదానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంతటిని మనష్షే అర్ధగోత్రమునకిచ్చితిని.

మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయాకాతీయుయొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి.

మాకీరీయులకు గిలాదునిచ్చితిని.

గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్యవరకును, యబ్బోకు నదివరకును అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును

కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండచరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడివ అరాబా సముద్రమువరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని.

ఆ కాలమందు నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరచుకొనునట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరు యుద్ధసన్నధ్దులై మీ సహోదరులగు ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను.

అయితే యెహోవా మీకు విశ్రాంతి నిచ్చినట్లు మీ సహోదరులకును, విశ్రాంతి నిచ్చువరకు,

అనగా మీ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొనువరకు, మీ భార్యలును మీ పిల్లలును మీ మందలును నేను మీకిచ్చిన పురములలో నివసింపవలెను. తరువాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగిరావలెనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియును.

ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటిని మీ దేవుడైన యెహోవా ఈ యిద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులార చూచితివి గదా. నీవు వెళ్లుచున్న రాజ్యములనన్నిటికిని యెహోవా ఆలాగుననే చేయును.

మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని.

మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టియున్నావు.

ఆకాశమందేగాని భూమియందేగాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు?

నేను అద్దరికివెళ్లి యొర్దాను అవతలనున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా

యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను చాలును; ఇకను ఈ సంగతినిగూర్చి నాతో మాటలాడవద్దు.

నీవు ఈ యొర్దానును దాటకూడదు గాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటివైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము.

యెహోషువకు ఆజ్ఞయిచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నదిదాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొనచేయును.

అప్పుడు మనము బేత్పయోరు యెదుటనున్న లోయలో దిగియుంటిమి.