పవిత్ర గ్రంథాలు

ద్వితియోపదేశాకాండము

అధ్యాయం 1

యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.

హోరేబునుండి శేయీరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయవరకు పదకొండు దినముల ప్రయాణము.

హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనును అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయీలో హతముచేసిన తరువాత

నలుబదియవ సంవత్సరములో పదకొండవ నెల మొదటి తేదిని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకాజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను.

యొర్దాను ఇవతలనున్న మోయాబు దేశమున మోషే యీ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను

మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును;

మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబాలోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసు వరకును వెళ్లుడి.

ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణముచేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి.

అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను.

మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశనక్షత్రములవలె విస్తరించియున్నారు.

మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వెయ్యిరెట్లు ఎక్కువచేసి, తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక.

నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను?

జ్ఞానవివేకములు కలిగి, మీ మీ గోత్రములలో ప్రసిద్ధిచెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి; వారిని మీమీద నియమించెదనని మీతో చెప్పగా

మీరు నీవు చెప్పిన మాటచొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి.

కాబట్టి బుద్ధికలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని, మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యిమందికి ఒకడును, నూరుమందికి ఒకడును ఏబదిమందికి ఒకడును, పదిమందికి ఒకడును వారిని, మీమీద నేను నియమించితిని.

అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి, ప్రతి మనుష్యునికిని వాని సహోదరునికిని వానియొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను.

తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతిగాని ఘనుల సంగతిగాని పక్షపాతములేకుండ వినవలెను; న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యెమును నాయొద్దకు తీసికొనిరావలెను; నేను దానిని విచారించెదనని వారికాజ్ఞాపించితిని.

మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములనుగూర్చి అప్పుడు మీకాజ్ఞాపించితిని.

మనము హోరేబునుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములోనుండి వచ్చి, అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితివిు.

అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నెమునకు వచ్చియున్నాము.

ఇదిగో నీ దేవుడైన యెహోవా యీ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకొనుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని.

అప్పుడు మీరందరు నాయొద్దకు వచ్చి మనకంటె ముందుగా మనుష్యులను పంపుదము; వారు మనకొరకు ఈ దేశమును వేగుజూచి, తిరిగివచ్చి అందులోనికి మనము వెళ్లవలసిన త్రోవను గూర్చియు, మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి.

ఆ మాట మంచిదనుకొని నేను గోత్రమొక్కంటికి ఒక మనుష్యుని చొప్పున పన్నిద్దరు మనుష్యులను పిలిపించితిని.

వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుజూచి ఆ దేశఫలములను చేతపట్టుకొని

మనయొద్దకు తీసికొనివచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి.

అయితే మీరు వెళ్లనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి

మీ గుడారములలో సణుగుచు యెహోవా మనయందు పగపట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయులచేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములోనుండి మనలను రప్పించియున్నాడు.

మనమెక్కడికి వెళ్లగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్తరులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతో నున్నవి; అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి.

అప్పుడు నేను మిమ్మునుచూచి దిగులుపడకుడి, వారికి భయపడకుడి,

మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులయెదుట

ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధముచేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొనివచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని.

అయితే మీకు త్రోవచూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు

రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాసముంచలేదు.

కాగా యెహోవా మీరు చెప్పిన మాటలువిని

బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన యీ మంచిదేశమును ఈ చెడ్డతరమువారిలో

యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చెదనని ప్రమాణముచేసెను.

మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించునుగాని నీవు దానిలో ప్రవేశింపవు.

అతడు ఇశ్రాయేలీయులు దాని స్వాధీనపరచుకొనచేయును గనుక అతని ధైర్యపరచుము.

ఆ దినమున మంచిచెడ్డలనెరుగని మీ కుమారులు, అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు; దానిని వారికిచ్చెదను; వారు దానిని స్వాధీనపరచుకొందురు.

మీరు తిరిగి ఎఱ్ఱసముద్రమార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను.

అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితివిు; మా దేవుడైన యెహోవా మాకాజ్ఞాపించిన మాటలన్నిటిననుసరించి మేము పోయి యుద్ధము చేసెదమని నాతో ఉత్తరమిచ్చి, మీరందరు మీ ఆయుధములను కట్టుకొని, ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా

యెహోవా నాతో ఇట్లనెను యుద్ధమునకు పోకుడి; నేను మీ మధ్యనుండనుగనుక వెళ్లకుడి; మీరు వెళ్లినను మీ శత్రువులయెదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము.

ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్లితిరి.

అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి, కందిరీగలవలె మిమ్ము తరిమి హోర్మావరకు శేయీరులో మిమ్ము హతముచేసిరి.

తరువాత మీరు తిరిగివచ్చి యెహోవా సన్నిధిని యేడ్వగా, యెహోవా మీ మొఱను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు.

కాగా మీరు కాదేషులో బహు దినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి.