ద్వితియోపదేశాకాండము
అధ్యాయం 2
మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎఱ్ఱసముద్రమార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహు దినములు శేయీరు మన్నెము చుట్టు తిరిగితివిు.
అంతట యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను మీరు ఈ మన్నెముచుట్టు తిరిగినకాలము చాలును;
ఉత్తరదిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము
శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవుచున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి.
వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను.
మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును.
నీచేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమియు తక్కువకాదు.
అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపువారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గమునుండి మనము ప్రయాణము చేసితివిు.
మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను మోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను.
పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె, ఉన్నతదేహులు, బలవంతులైన బహు జనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడినవారు.
మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి.
పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి.
కాబట్టి మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవియ్యగా జెరెదు ఏరు దాటితివిు.
మనము కాదేషు బర్నేయలోనుండి బయలుదేరి జెరెదు ఏరు దాటువరకు, అనగా యెహోవా వారినిగూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరమువారందరు సేనలోనుండకుండ నశించువరకు మనము నడిచిన కాలము ముప్పది యెనిమిది సంవత్సరములు. అంతేకాదు, వారు నశించువరకు
సేన మధ్యనుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను.
సైనికులైన వారందరు ప్రజలలోనుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను.
నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోవుచున్నావు.
అమ్మోనీయుల మార్గమున వెళ్లునప్పుడు
వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను.
అదియు రెఫాయీయుల దేశమని యెంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజుమ్మీయులందురు.
వారు అనాకీయులవలె ఉన్నతదేహులు, బలవంతులైన బహు జనులు. అయితే యెహోవా అమ్మోనీయుల యెదుటనుండి వారిని వెళ్లగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరచుకొని వారిచోట నివసించిరి.
అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానముకొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి యెదుటనుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటివరకు వారిచోట నివసించుచున్నారు.
గాజావరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులోనుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీయులు నశింపజేసి వారిచోట నివసించిరి.
మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి; ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీచేతికి అప్పగించితిని. దాని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి.
నేడు నేను నీవలని భయము నీవలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశములవారికిని పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నిన్నుగూర్చిన సమాచారము విని నీయెదుట వణకి మనోవేదన నొందుదురు.
అప్పుడు నేను కెదేమోతు అరణ్యములోనుండి హెష్బోను రాజైన సీహోనునొద్దకు దూతలను పంపి
నన్ను నీ దేశముగుండ దాటిపోనిమ్ము, కుడియెడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును.
నాయొద్ద రూకలు తీసికొని తినుటకు భోజనపదార్థములు నాకిమ్ము; నాయొద్ద రూకలు తీసికొని త్రాగుటకు నీళ్లిమ్ము.
శేయీరులో నివసించు ఏశావు సంతానపువారును ఆరులో నివసించు మోయాబీయులును నాకు చేసినట్లు, మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యొర్దాను దాటువరకు కాలినడకచేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని.
అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్లనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీచేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను.
అప్పుడు యెహోవా చూడుము; సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టియున్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాని స్వాధీనపరచుకొన మొదలుపెట్టుమని నాతో చెప్పెను.
సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా
మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతముచేసి
ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని, ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియులేకుండ నాశనము చేసితివిు.
పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి.
అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదువరకు మనకు అసాధ్యమైన నగరమొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను.
అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని యే ప్రాంతమునకైనను ఆ మన్నెములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు.