పవిత్ర గ్రంథాలు

యెషయా

అధ్యాయం 37

హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకుపోయి

గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను.

వీరు గోనెపట్ట కట్టుకొనినవారై అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి హిజ్కియా సెలవిచ్చునదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు.

జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.

రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా

యెషయా వారితో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.

అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును; వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును. అతని దేశమందు ఖడ్గముచేత అతనిని కూలజేయుదును.

అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచివెళ్లి లిబ్నామీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.

అంతట కూషు రాజైన తిర్హాకా తనమీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియాయొద్దకు దూతలను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను.

యూదా రాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి యెరూషలేము అష్షూరు రాజుచేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.

అష్షూరు రాజులు సకలదేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా; నీవు మాత్రము తప్పించుకొందువా?

నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులు గాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?

హమాతు రాజు ఏమాయెను? అర్పాదు రాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి? అని వ్రాసిరి

హిజ్కియా దూతలచేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి

యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను

యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై యున్నావు.

సైన్యములకధిపతివగు యెహోవా, చెవి యొగ్గి ఆలకించుము; యెహోవా, కన్నులుతెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినవాని మాటలను చెవినిబెట్టుము.

యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి

వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలముచేసిరి.

యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలిసికొనునట్లు అతని చేతిలోనుండి మమ్మును రక్షించుము.

అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాయొద్దకు ఈ వర్తమానము పంపెను ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట ప్రార్థన చేసితివే.

అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట ఏదనగా సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది.

నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి యెవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా?

నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి నీవీలాగు పలికితివి నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదికిని లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించియున్నాను.

నేను త్రవ్వి నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటిని ఎండిపోచేసియున్నాను

నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నావలననే సంభవించినది.

కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి. విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.

నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.

నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.

మరియు యెషయా చెప్పినదేమనగా హిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దానినుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము ననుభవించుదురు.

యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.

శేషించువారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు, తప్పించుకొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును.

కాబట్టి అష్షూరు రాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడిదిబ్బ కట్టడు.

ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును; ఇదే యెహోవా వాక్కు.

నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.

అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో లక్ష యెనుబదియైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబరములుగా ఉండిరి.

అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత

అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతు దేశములోనికి తప్పించుకొనిపోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.