యెషయా
అధ్యాయం 39
ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన మెరోదక్బలదాను హిజ్కియా రోగియై బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతనియొద్దకు పంపగా
హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన యింటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగుచేయక తన పదార్థములుగల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించెను.
పిమ్మట ప్రవక్తయైన యెషయా రాజైన హిజ్కియాయొద్దకు వచ్చిఆ మనుష్యులు ఏమనిరి? నీయొద్దకు ఎక్కడనుండి వచ్చిరి? అని యడుగగా హిజ్కియా బబులోనను దూరదేశమునుండి వారు వచ్చియున్నారని చెప్పెను.
నీ యింట వారేమేమి చూచిరని అతడడుగగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగుచేయక నా యింటనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నాననెను.
అంతట యెషయా హిజ్కియాతో నిట్లనెను యెహోవా సెలవిచ్చు మాట వినుము
రాబోవు దినములలో ఏమియు మిగులకుండ నీ యింటనున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోవుదురని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొనిపోవుదురు.
అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే; నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో అనెను.