యెషయా
అధ్యాయం 6
రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.
ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను.
వారు సైన్యములకధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.
వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమముచేత నిండగా
నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.
అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నాయొద్దకు ఎగిరివచ్చి నా నోటికి దాని తగిలించి
ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను.
అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా
ఆయన నీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.
వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.
ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేనడుగగా ఆయన నివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగువరకును దేశము బొత్తిగా బీడగువరకును
యెహోవా మనుష్యులను దూరముగా తీసికొనిపోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగువరకును ఆలాగున జరుగును.
దానిలో పదియవ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సిందూర మస్తకివృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె నుండును; అట్టి మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును.