Logo

1రాజులు అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిమీద రాజాయెను.

02 అతనియొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు;

03 షీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధాన మంత్రులు; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడై యుండెను;

04 యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి; సాదోకును అబ్యాతారును యాజకులు.

05 నాతాను కుమారుడైన అజర్యా అధికారులమీద ఉండెను; నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునై యుండెను;

06 అహీషారు గృహ నిర్వాహకుడు; అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయములో అధికారి.

07 ఇశ్రాయేలీయులందరిమీద సొలొమోను పన్నిద్దరు అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను.

08 వారి పేళ్లు ఇవే; ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు,

09 మాకస్సులోను షయల్బీములోను బేత్షెమెషులోను ఏలోన్బెధానానులోను దెకెరు కుమారుడు;

10 అరుబ్బోతులో హెసెదు కుమారుడు; వీనికి శోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను.

11 మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్యప్రదేశమంతయు నియమింపబడెను; సొలొమోను కుమార్తెయైన టాపాతు ఇతని భార్య.

12 మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దోయును బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతానుండి బేత్షెయాను మొదలుకొని ఆబేల్మేహోలావరకును యొక్నెయాము అవతలి స్థలమువరకును వ్యాపించుచున్నది.

13 గెబెరు కుమారుడు రామోత్గిలాదునందు కాపురముండెను; వీనికి గిలాదులోనుండిన మనష్షేకు కుమారుడైన యాయీరు గ్రామములును బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను; అది ప్రాకారములును ఇత్తడి అడ్డ గడలునుగల అరువది గొప్ప పట్టణములుగల ప్రదేశము.

14 ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను.

15 నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను; వీడు సొలొమోను కుమార్తెయైన బాశెమతును వివాహము చేసికొనెను.

16 ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనా యుండెను.

17 ఇశ్శాఖారు దేశమందు పరూ యహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను.

18 బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ యుండెను.

19 గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సీహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను; అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి.

20 అయితే యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి.

21 నది (యూఫ్రటీసు) మొదలుకొని ఐగుప్తు సరిహద్దువరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటిమీదను ఫిలిష్తీయుల దేశమంతటిమీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రదికిన దినములన్నియు అతనికి సేవచేయుచు వచ్చిరి.

22 ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి యెంతయనగా, ఆరువందల తూముల సన్నపు గోధుమపిండియు, వేయిన్ని రెండువందల తూముల ముతకపిండియు,

23 క్రొవ్విన యెడ్లు పదియు, విడియెడ్లు ఇరువదియు, నూరు గొఱ్ఱలును, ఇవియు గాక ఎఱ్ఱదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాతులును తేబడెను.

24 యూఫ్రటీసునది యివతల తిప్సహు మొదలుకొని గాజావరకును నది యివతల నున్న రాజులందరిమీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను.

25 సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.

26 సొలొమోను రథములకు నలువదివేల గుఱ్ఱపు శాలలును రౌతులకు పండ్రెండు వేల గుఱ్ఱములును ఉండెను.

27 మరియు రాజైన సొలొమోనునకును రాజైన సొలొమోను భోజనపు బల్లయొద్దకు వచ్చిన వారికందరికిని ఏమియు తక్కువకాకుండ అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమునుబట్టి ఆహారము సంగ్రహము చేయుచు వచ్చెను.

28 మరియు గుఱ్ఱములును పాటుపశువులును ఉన్న ఆ యా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను.

29 దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను

30 గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశస్థుల జ్ఞానముకంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై యుండెను.

31 అతడు సమస్తమైన వారికంటెను, ఎజ్రాహీయుడైన ఏతానుకంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్ద అను వారికంటెను జ్ఞానవంతుడై యుండెను గనుక అతని కీర్తి చుట్టునున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను.

32 అతడు మూడువేల సామెతలు చెప్పెను, వెయ్యిన్ని యయిదు కీర్తనలు రచించెను.

33 మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినిగూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి నన్నిటినిగూర్చియు అతడు వ్రాసెను.

34 అతని జ్ఞానపు మాటలు తెలిసికొనుటకై అతని జ్ఞానమునుగూర్చి వినిన భూపతులందరిలోనుండియు, జనులందరిలోనుండియు మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి.