1రాజులు
అధ్యాయం 22
సిరియనులును ఇశ్రాయేలువారును మూడు సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి.
మూడవ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలురాజునొద్దకు రాగా
ఇశ్రాయేలురాజు తన సేవకులను పిలిపించి రామోత్గిలాదు మనదని మీరెరుగుదురు; అయితే మనము సిరియా రాజు చేతిలోనుండి దాని తీసికొనక ఊరకున్నామని చెప్పి
యుద్ధము చేయుటకు నాతోకూడ నీవు రామోత్గిలాదునకు వచ్చెదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు నేను నీవాడనే; నా జనులు నీ జనులే నా గుఱ్ఱములును నీ గుఱ్ఱములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను.
పిమ్మట యెహోషాపాతు నేడు యెహోవాయొద్ద విచారణ చేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా
ఇశ్రాయేలురాజు దాదాపు నాలుగు వందలమంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాదుమీదికి పోదునా పోకుందునా అని వారినడిగెను. అందుకు యెహోవా దానిని రాజైన నీచేతికి అప్పగించును గనుక
పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను.
అందుకు ఇశ్రాయేలు రాజు ఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు; అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణ చేయవచ్చును గాని, అతడు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతురాజైన మీరు ఆలాగనవద్దనెను.
అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఒకనిని పిలిచి ఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను.
ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని, షోమ్రోను గవిని దగ్గరనున్న విశాలస్థలమందు గద్దెలమీద ఆసీనులైయుండి, ప్రవక్తలందరును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా
కెనయనా కుమారుడైన సిద్కియా యినుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటిచేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను.
ప్రవక్తలందరును ఆ చొప్పుననే ప్రకటన చేయుచు యెహోవా రామోత్గిలాదును రాజవైన నీచేతికి అప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి.
మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా
మీకాయా యెహోవా నాకు సెలవిచ్చునదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదుననెను.
అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు మీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదుమీదికి పోదుమా పోకుందుమా అని యడుగగా అతడు యెహోవా దానిని రాజవైన నీచేతికి నప్పగించును గనుక నీవు దానిమీదికిపోయి జయమొందుదువని రాజుతో అనెను.
అందుకు రాజు నీచేత ప్రమాణము చేయించి యెహోవా నామమునుబట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవియ్యగా
అతడు ఇశ్రాయేలీయులందరును కాపరిలేని గొఱ్ఱలవలెనే కొండలమీద చెదరియుండుట నేను చూచితిని వారికి యజమానుడు లేడు; ఎవరి యింటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను.
అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి ఇతడు నన్నుగూర్చి మేలు పలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా
మీకాయా యిట్లనెను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని
అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి.
అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.
అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.
యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.
మీకాయా యిట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి నీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏవైపుగా పోయెనని చెప్పి మీకాయాను చెంపమీద కొట్టెను.
అందుకు మీకాయా దాగుకొనుటకై నీవు ఆ యా గదులలోనికి చొరబడునాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పెను.
అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకాయాను పట్టుకొని తీసికొనిపోయి పట్టణపు అధికారియైన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి
బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగివచ్చువరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను.
అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను సకలజనులారా, నా మాట ఆలకించుడని చెప్పెను రాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నాచేత పలుకలేదు.
ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా
ఇశ్రాయేలు రాజు నేను మారువేషము వేసికొని యుద్ధములో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసికొని యుద్ధమందు ప్రవేశించెను.
సరియారాజు తన రథములమీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిపించి అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు; ఇశ్రాయేలురాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చియుండగా
రథాధిపతులు యెహోషాపాతును చూచి యితడే ఇశ్రాయేలు రాజనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలువేయగా
రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజు కానట్టు గురుతుపట్టి అతని తరుముట మానివేసిరి.
పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపుకీలు మధ్యను తగిలెను గనుక అతడునాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసికొని పొమ్మని తన సారధితో చెప్పెను.
నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల యెదుట అతని రథముమీద నిలువబెట్టిరి; అస్తమయమందు అతడు మరణమాయెను; తగిలిన గాయములోనుండి అతని రక్తము కారి రథములో మడుగుగట్టెను.
సూర్యాస్తమయ సమయమందు దండువారందరు తమ తమ పట్టణములకును దేశములకును వెళ్లిపోవచ్చునని ప్రచురమాయెను.
ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను.
వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను.
అహాబు చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానంతటినిగూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటినిగూర్చియు, అతడు కట్టించిన పట్టణములనుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
అహాబు తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.
ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను.
యెహోషాపాతు ఏలనారంభించినప్పుడు అతడు ముప్పది యయిదేండ్లవాడై యెరూషలేములో యిరువది యైదేండ్లు ఏలెను; అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కుమార్తెయై యుండెను.
అతడు తన తండ్రియైన ఆసా యొక్క మార్గములన్నిటి ననుసరించి, యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచు వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు; ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచునుండిరి.
యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధిచేసెను.
యెహోషాపాతు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు కనుపరచిన బలమునుగూర్చియు, అతడు యుద్థముచేసిన విధమునుగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
తన తండ్రియైన ఆసా దినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములోనుండి వెళ్లగొట్టెను.
ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను; ప్రధానియైన యొకడు రాజ్యపాలనము చేయుచుండెను.
యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలైపోయెను.
అహాబు కుమారుడైన అహజ్యానా సేవకులను నీ సేవకులతో కూడ ఓడలమీద పోనిమ్మని యెహోషాపాతు నడుగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు.
పిమ్మట యెహోషాపాతు తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదుపురమందు తన పితరులతోకూడ పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజాయెను.
అహాబు కుమారుడైన అహజ్యా యూదారాజైన యెహోషాపాతు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి రెండు సంవత్సరములు ఇశ్రాయేలును ఏలెను.
అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి,తన తలిదండ్రులిద్దరి ప్రవర్తనను, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను.
అతడు బయలు దేవతను పూజిం చుచు, వానికి నమస్కారము చేయుచు, తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.